- బాదితురాలి కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం
- కోల్కతా ట్రెయినీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసు
- సంచలన తీర్పు వెలువరించిన కోల్కత్తా సీల్దా కోర్టు
కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రెయినీ వైద్యురాలిపై హత్యాచారం కేసుకు సంబంధించి దోషి సంజయ్ రాయ్ కి కోల్కతాలోని సిల్దా కోర్టు జీవిత ఖైదు శిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే విచారణను పూర్తి చేసిన కోల్కతాలోని సీల్దా కోర్టు.. గత శనివారం సంజయ్ రాయ్ దోషి అని తేల్చింది. ఈ కేసులో సోమవారం తీర్పు వెలువరిస్తామని చెప్పిన కోర్టు.. తాజాగా అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది.
మరోవైపు ఇంత దారుణంగా అత్యాచారం, హత్య చేసిన సంజయ్ రాయ్ కి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. కేసులో తీర్పు ఇవ్వడానికి ముందుగా సీల్దా కోర్టు జడ్జి జస్టిస్ అనిర్బన్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు అరుదైనదని తాను భావించడం లేదని.. అందుకే చనిపోయే వరకు జైలు శిక్ష అనుభవించాలని తీర్పును ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులకు రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
2023 ఆగస్ట్ 9న రాత్రి కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ సెమినార్ రూమ్లో నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్పై అత్యాచారం, ఆపై హత్య జరగడం దేశంలో తీవ్ర సంచలనం రేపింది. మొదట కోల్కతా పోలీసులు ఈ కేసు విచారణ ప్రారంభించగా.. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే అందులో చేర్చింది. అయితే ఈ ఘటనలో సామూహిక అత్యాచారం విషయాన్ని ఛార్జిషీట్లో పేర్కొనలేదు. ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్ ని గతేడాది ఆగస్ట్ 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదే కేసులో అరెస్ట్ అయిన ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇంఛార్జ్ అభిజిత్ మండల్లకు ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ ఘటనలో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. అరెస్ట్ తర్వాత 90 రోజుల్లో పోలీసులు, సీబీఐ ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోవడంతో వారికి బెయిల్ వొచ్చింది. సంజయ్ రాయ్ జీవిత ఖైదు శిక్ష విధించింది.
అతడు మరణించే వరకు జైల్లోనే ఉంచాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. అలాగే సంజయ్రాయ్కు రూ.50 వేల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. అందులోభాగంగా మొత్తం120 మంది సాక్షులను సీబీఐ విచారించింది. దీంతో భారత న్యాయసంహిత చట్టంలోని సెక్షన్లు 64, 66,103/1 కింద సంజయ్కు జీవిత ఖైదు విధించింది.