సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టయ్యారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయనను ఏపీకి తరలిస్తున్నారు. కొమ్మినేనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ టీవీ ఛానెల్లో డిబేట్ సందర్భంగా రాజధాని ప్రాంతంపై, అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద తాడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షి టీవీపై సైతం కేసు నమోదు అయింది. మహిళలపై అనుచిత వ్యాఖల చేసిన కేసులో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్, సాక్షి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), SC, ST POA Act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ ఎందుకు వచ్చారని సైతం పోలీసులను గట్టిగా అడిగారు. మీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది, కేసు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆయనకు తెలిపారు. తనను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా పోలీసులు తనకు సమాధానం చెప్పలేదని వాపోయారు. ఎఫ్ఆర్ కాపీని చూపించిన వెంటనే ఆయనను అరెస్టు చేసి పోలీసు వాహనంలో విజయవాడకు తరలిస్తున్నారు. ఇటీవల డిబేట్ సందర్భంగా అమరావతి మహిళలు వేశ్యలు అంటూ విశ్లేషకులు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల్ని సాక్షి యాజమాన్యం ఇప్పటికే ఖండించినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని, సమస్యలు కొని తెచ్చుకోవడమేనని కొమ్మినేని శ్రీనివాసరావు సైతం ఆ వ్యాఖ్యల్ని ఖండించారని చెబుతున్నారు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా పాలన సాగిస్తుందని కొమ్మినేని అన్నారు. తాను సీనియర్ సిటిజన్నని, సీనియర్ జర్నలిస్ట్ నని.. అయినా తన వరకు రెడ్బుక్ రాజ్యాంగం వచ్చిందని వ్యాఖ్యానించారు. తనపై నమోదైన కేసుకు సంబంధించి వివరాలు, ఫిర్యాదుదారు వివరాలు పోలీసులు చెప్పడం లేదన్నారు. ప్రజా గళాన్ని వినిపించేందుకు తాను డిబేట్ లలో పాల్గొంటానని.. తనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య ఉల్లంఘనేనని తన అరెస్ట్ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.