రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నారాయణపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ను రేవంత్ ప్రారంభించారు. మహిళలో ముఖాముఖీ మాట్లాడిన రేవంత్.. కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చుతామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు. అదేవిధంగా త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు ఇస్తామన్నారు సీఎం. సొంత ఆడబిడ్డలకు ఇచ్చినట్లు నాణ్యమైన చీరలను అందిస్తామన్నారు. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశామన్నారు.
రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తిలో 67 లక్షల మంది ఉన్నారని, మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ను మహిళా సంఘాలకు అప్పగించామని, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని, శిల్పారామం పక్కనే పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత ఎదగాలని, గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని, 1000 కోట్లతో మహిళా సమాఖ్య సభ్యులకు చీరలు ఇస్తామని చెప్పారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఏడాదిలో రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని, గత ప్రభుత్వం మామూలు చీరలు ఇచ్చేదని, తమ ప్రభుత్వం నాణ్యమైన చీరలు ఇస్తుందని రేవంత్ అన్నారు.
రూరల్, అర్బన్ అనే తేడా లేదని, తెలంగాణలో మహిళలంతా ఒక్కటే అని సీఎం రేవంత్ అన్నారు. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందామని, ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని, పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం కోరారు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలి అని రేవంత్ సూచించారు.