పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటనలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నకిరేకల్ పోలీస్స్టేసన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు అయ్యింది. పది పరీక్షలో మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ ట్వీట్పై నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్పై నకిరేకల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్పై నకిరేకల్ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు ఉగ్గడి శ్రీనివాస్ కూడా సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు.
కాగా.. ఈనెల 21న నకిరేకల్లో టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నల్గొండ జిల్లా నకిరేకల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలోని 8వ నెంబర్ గది నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్తో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను విధుల నుంచి తొలగించగా.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్ను కూడా సస్పెండ్ చేశారు. అంతే కాకుండా ప్రశ్నపత్రం లీకేజ్ అవడానికి ఓ విద్యార్థిని కారణం అంటూ ఆమెను డిబార్ చేశారు. అయితే పేపర్ లీక్పై తనకు ఏ పాపం తెలియదని.. ఓ వ్యక్తి కిటీకి వద్దకు పేపర్ చూపించాలని లేకపోతే రాయితో కొడతానని బెదిరించానని.. అందువల్లే భయంతో పేపర్ చూపించినట్లు వాపోయింది. తనను డిబార్ చేయొద్దని.. పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని విద్యార్థిని వేడుకుంది.