- మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు
- మరో ఇద్దరు నేతలకు కూడా..!
టీఎస్, న్యూస్:ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ…అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ట్యాపింగ్ అంశంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా… పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించారు. వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన మరికొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్ లకు మరోసారి నోటీసులు పంపించారు. తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేదే లేదని తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తమకు ఉన్న రక్షణలను ఉపయోగించుకొని చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల్లోగా మంత్రులు కొండా సురేఖ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.