-
బహ్రెయిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నర్సయ్య
-
స్వదేశానికి వచ్చేలా చర్యలు చేపట్టాలి
-
భారత ఎంబిసీ అధికారులకు లేఖ రాసిన
-
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
పాస్పోర్ట్ సమస్యల కారణంగా బహ్రెయిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్యను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భారత ఎంబిసీ అధికారులకు లేఖ రాశారు. ఇదే అంశంపై ఇప్పటికే బిఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం బహ్రెయిన్కు వెళ్లిన నర్సయ్య మూడేళ్ల పాటు తాపీమేస్త్రీగా పనిచేశాడు. అయితే వర్క్ పర్మిట్ ముగియడంతో అక్కడే ఉండిపోయాడు.
దీంతో పాస్పోర్ట్, వీసా లేనందున బహ్రెయిన్లో కొన్నేండ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకుని ఎమ్మెల్యే శ్రీనివాస్ తక్షణమే స్పందించి ఆయన్ను స్వదేశానికి రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబిసీ అధికారులతో మాట్లాడారు. నర్సయ్యను దేశానికి తీసుకువచ్చేందుకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. బ్రతుకుదెరువు కోసం నర్సయ్య 1996లో బహ్రెయిన్ వెళ్లారు. అక్కడి ‘ది అరబ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ’లో మూడేళ్లపాటు తాపీమేస్త్రీగా పనిచేశారు.
1999 ఆగస్ట్లో వర్ పర్మిట్ ముగిసినా నర్సయ్య అక్కడే పనిచేస్తూ ఉన్నాడు. పాస్పోర్ట్ గడువు కూడా 2001లో ముగియటంతో బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబిసీ రెన్యువల్ చేసింది. ఆ గడువు కూడా ముగిసిందని, అయితే నర్సయ్య తనవద్దనున్న పాస్పోర్ట్ పొగొట్టుకున్నాడు. నర్సయ్య విషయమై అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబులు ఆందోళన వ్యక్తం చేశారు.