రాష్ట్ర రాజకీయాల్లో మొత్తంగా కవిత కొత్త కుంపటి ఖరారైంది. ఇప్పటికే కుటుంబంతో విభేదించి.. ఇప్పుడు తన దారి తాను చూసుకుంటుంది. కొత్తగా ఓ ఆఫీస్ను ప్రారంభం చేస్తుంది. ఈ పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటి పోరు రచ్చకెక్కింది. అన్న కేటీఆర్ పై యుద్ధం ప్రకటించిన కవిత సొంత దారి చూసుకోబోతున్నట్టు ప్రచారం బలంగా సాగుతోంది. రేపో మాపో పార్టీ ప్రకటన కూడా వచ్చేస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందు కూడా కొందరు మహిళా నేతలు సొంత పార్టీలు పెట్టి వాటిని మూసివేశారు. అలా ఎందుకు జరుగుతోంది. ఇప్పుడు కవిత కొత్త పార్టీ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది కొంత ఆసక్తికర చర్చ.
ఎన్టీఆర్ టీడీపీ
1995లో ఎన్టీఆర్ మరణం తర్వాత 1996లో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు. ఎన్టీఆర్ బతికి ఉండగా ఆయన అధికారిక కార్యక్రమాల్లోనూ, పార్టీలోనూ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారు అంటూ లక్ష్మీపార్వతిపై టిడిపిలో అంతర్గత తిరుగుబాటు చెలరేగింది. ఆ వివాదాల్లో ఎన్టీఆర్ పదవి కోల్పోవడం చంద్రబాబు వర్గం టిడిపిని కైవసం చేసుకోవడం, తిరిగి రాజకీయంగా పుంజుకునేలోపు ఎన్టీఆర్ మృతి చెందడం వంటి ఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. ఆ స్థితిలో పార్టీలో చంద్రబాబుతో కలవని 28 MLAలతో కలిసి ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు లక్ష్మి పార్వతి. కానీ 1996 లోక్ సభ ఎన్నికల్లో 42 సీట్లలో, 1998లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో (బీజేపీతో పొత్తు పెట్టుకుని ) 294 సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు. అక్కడి నుంచి పార్టీ నెమ్మదిగా క్షీణిస్తూ 2004 వచ్చే సరికి పూర్తిగా ప్రాభవాన్నీ కోల్పోయింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరులో పోటీ చేసిన లక్ష్మి పార్వతికి స్వయంగా వచ్చిన ఓట్లు 946. 2014లో లక్ష్మి పార్వతి వైసీపీలో చేరారు. దానితో 2016లో భారత ఎన్నికల సంఘం “ఎన్టీఆర్ టీడీపీ ” పార్టీని తమ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించింది.
రేణుకా చౌదరి – టీడీపీ 2
తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు (1986-92, 1992-1998) రాజ్యసభ ఎంపీగా పనిచేసిన రేణుకా చౌదరి సొంతంగా ఒక పార్టీని అనౌన్స్ చేసిన విషయం ఈ జెనరేషన్లో చాలామందికి తెలియదు. టీడీపీకి నమ్మిన బంటులా ఉండే రేణుక చౌదరి 1994లో పార్టీ వ్యవహారాలు నచ్చక ఎన్టీఆర్తో విభేదించారు ఏకంగా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా హిందూపూర్లో ప్రచారం చేయడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ సమయంలో తన రాజ్యసభ పదవిని కాపాడుకోవడానికి ఆమె ఎన్టీఆర్-2 పేరుతో పార్లమెంట్లో కొత్త పార్టీ విభాగాన్ని ప్రకటించారు. నిజానికి దీన్ని పూర్తిస్థాయి పార్టీగా చెప్పలేం. ఉన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు దీనిలో మెంబర్లుగా ఉండేవారు. పార్టీలో లక్షీపార్వతి ఇష్యూ తరువాత ఆమె టీడీపీ -2ని రద్దు చేశారు. 1998లో తన రాజ్యసభ టర్మ్ పూర్తి కాగానే మూడోసారి పదవి ఆశించారు కానీ చంద్రబాబు ఆమెకు బదులుగా సినీ నటి జయప్రదకు ఆ పదవి కేటాయించడంతో రేణుకా చౌదరి కాంగ్రెస్లో చేరి నేషనల్ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించారు.
విజయశాంతి – తల్లి తెలంగాణ
సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్గా వెలుగొందిన విజయశాంతి 1998లో బీజేపీలో చేరారు. కానీ 2005 జనవరిలో “తల్లి తెలంగాణ” అనే పార్టీ స్థాపించారు. తెలంగాణలోని ఆర్థిక సామాజిక అసమానతలపై పోరాటం, ఫ్లోరైడ్ ఏరియాల్లో రక్షిత మంచినీటి కల్పన, స్త్రీలకు సరైన న్యాయం అందేలా చూడడం వంటి ఆశయాలతో విజయశాంతి స్థాపించిన ఈ పార్టీ ప్రజల మద్దతు పొందడంలో సక్సెస్ కాలేదు. తెలంగాణవాద పార్టీల ఏకీకరణలో భాగంగా 2009లో ఆమె తన ” తల్లి తెలంగాణ” పార్టీని TRS లో కలిపేశారు. తర్వాత ఎన్నికల్లో ఆమె కేసీఆర్ తో కలిసి టిఆర్ఎస్ తరఫున మెదక్ ఎంపీగా పనిచేశారు. తర్వాత కాలంలో కేసీఆర్ తో విభేదించి టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత అనేక పార్టీలు మారుతూ ప్రస్తుతం కాంగ్రెస్ తరపున తెలంగాణ శాసనమండలి లో సభ్యురాలి గా ఉన్నారు.
కొత్తపల్లి గీత – జన జాగృతి
ఒకప్పటి డిప్యూటీ కలెక్టర్, వ్యాపారవేత్త, మాజీ ఎంపీ కొత్త పల్లి గీత స్థాపించిన పార్టీ “జన జాగృతి”.” మార్పు కోసం ముందడుగు “ఈ పార్టీ నినాదం. 2014లో అరకు ఎంపీగా వైసీపీ నుంచి గెలుపొందిన కొత్తపల్లి గీత తరువాతి కాలంలో టీడీపీకి సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలోనే ఆమె బిజెపిలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఆమె ” జన జాగృతి ” అనే పార్టీ స్థాపించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె తమ పార్టీ గుర్తు గొడుగు అని జెండా రంగు ముదురు, లేత నీలం అని ప్రకటించారు. అయితే తర్వాత కాలంలో ఆమె బిజెపిలో చేరిపోయి 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు.
షర్మిల- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా 2012 నుంచి ప్రత్యక్ష రాజకీయ క్షేత్రంలోకి వచ్చారు YS షర్మిల. అన్న కోసం మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు.2019 ఎన్నికల్లో “బైబై బాబూ” నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. అయితే అధికారులంలోకి వచ్చాక జగన్ తనకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ వైసిపి నుంచి బయటికి వచ్చేసారు. జులై 2021లో “తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ” అంటూ కొత్త పార్టీ స్థాపించి జనవరి 2024 వరకు దాన్ని నడిపారు. మధ్యలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినప్పుడు తమ పార్టీ పోటీ చేయదని కాంగ్రెస్కు మద్దతు పలుకుతుందని ఆమె ప్రకటించారు. అనంతరం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.
కవిత-కొత్త పార్టీ
ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత తన ధిక్కారస్వరాన్ని వినిపిస్తున్నారు. రేపు మాపో కొత్త పార్టీ అనౌన్స్మెంట్ వచ్చేలా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మహిళల చేత స్థాపించబడిన పార్టీలు ఎందుకనో సక్సెస్ కాలేదు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ,, దేవేంద్ర గౌడ్ స్థాపించిన నవతెలంగాణ పార్టీలాంటివి కూడా కాలగర్భంలో కలిసి పోయాయి. కానీ కేస్ స్టడీలుగా చెప్పుకోడానికి కొన్ని అయినా పురుషులు స్థాపించిన పార్టీలు కొనసాగుతున్నాయి.టీడీపీ, జనసేన, BRS, వైసీపీలను ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో మహిళలు స్థాపించిన పార్టీలన్నీ ఫెయిల్ అవుతుందడం ఆందోళన కలిగిస్తుంది అంటారు సామాజికవేత్తలు. మన సొసైటీలో అడుగడుగునా కూరుకుపోయిన పురుషాధిక్యత మహిళలను పార్టీ అధినేతలుగా ఒప్పుకోలేకపోతుందా అన్న అభిప్రాయం కొంతమందిలో ఉంది. అయితే వీళ్ళు పార్టీ పెట్టిన సమయంలో సరైన లీడింగ్ ఫ్యాక్టర్ లేకపోవడం, ఎమోషన్లో పార్టీలను అనౌన్స్ చేసేయడం, దీర్ఘకాలం పాటు పార్టీని నడిపే వ్యూహం లేకపోవడం వల్లే దెబ్బతిన్నట్టు రాజకీయ పండితులు చెబుతారు. అంతే గానీ స్త్రీలు పెట్టిన పార్టీలు పురుషులు పెట్టిన పార్టీలు అంటూ తేడా ఉండదు అని వారు అంటున్నారు. మరి ఇలాంటి విశ్లేషణలకు కవిత తన సొంత పార్టీతో (ఒకవేళ పెడితే) చెక్ పెడతారేమో చూడాలి.