Sunday, March 16, 2025

గొర్రెల స్కాం కేసులో రంగంలోకి ఈడీ

  • పీఎంఎల్ఏ కింద విచారణ చేస్తామని నోటీసులు

గొర్రెల పంపిణీలో రూ. 700 కోట్ల అక్రమాలు జరుగడంతో.. ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసుపై విచారణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలను సమర్పించాలని తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవెలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Sheep distribution scam update

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్‌ కార్యాలయం సంయుక్త సంచాలకుడు లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఓవైపు గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేస్తోంది. మరోవైపు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో ఇందులో మనీ లాండరింగ్‌ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుంది.

జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారనే అనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని తెలిపింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వండని ఆ లేఖలో పేర్కొంది.

నిందితులు మళ్లీ జైలుకు

మరోవైపు గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా అరెస్టై జైల్లో ఉన్న పశుసంవర్ధకశాఖ సీఈవో రామ్‌చందర్‌నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో విచారణ చేశారు. అసలు కుంభకోణానికి ఆద్యులెవరు? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? పదే పదే అవే గొర్రెలను కొన్నట్లు రికార్డుల్లో ఎలా చూపించారు? ఆడిటింగ్‌లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు? తదితర వివరాలు రాబట్టేందుకు ఏసీబీ వీరిద్దర్నీ మూడు రోజులపాటు విచారించింది.

అసలు గొర్రెలు అమ్మింది ఒకరైతే, వాటి తాలూకు డబ్బు దళారుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇలా ఎలా చేశారన్న వివరాలు కూడా తెలుసుకునేందుకు ఏసీబీ ప్రయత్నించింది. కానీ మూడు రోజులపాటు అనేక రకాలుగా ప్రశ్నించినా, నిందితుల నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. మూడు రోజుల గడువు ముగిసిపోవడంతో ఏసీబీ అధికారులు బుధవారం నాడు నిందితులకు వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com