- రుణమాఫీపై అందమైన కట్టుకథలు
- గాంధీభవన్ దాకా వొచ్చిన వారు ఇంటికీ వొస్తారు
- మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు
అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు నిలదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయని హరీష్ రావు తెలిపారు. గాంధీ భవన్ వద్ద ధర్నాకు దిగిన రైతు విషయంలో హరీష్ రావు స్పందించారు. అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరి గారికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నరు.
మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీ భవన్కు చేరకముందే పాపపరిహారం చేసుకోండి. రైతులు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు.. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అని రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. ఈరోజు గాంధీ భవన్ దాకా వొచ్చిన వారు, రేపో మాపో జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాకా వొస్తారు. ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు. ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిండు, అధికారులను వేడుకున్నడు. అయినా వెనకడుగు వేయకుండా గాంధీ భవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి పట్టుదలకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హాలు అమలు చేసే దాకా కొట్లాడాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిస్తున్నాం అని హరీష్ రావు పేర్కొన్నారు.