మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కలిస్తే.. ఆయనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని కొడాలి నాని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కొడాలి నాని కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని వైసీపీ శ్రేణులు, అభిమానులు దయ చేసి ఆయనను కలిసేందుకు హైదరాబాద్ రావద్దని వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్లో సన్నిహిత మిత్రుడు కుమారుడి రిసెప్షన్కు కొడాలి నాని తప్పని పరిస్థితుల్లో పాల్గొనడం జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. డాక్టర్ల సూచనల మేరకు కోవిడ్ దృష్ట్యా.. సర్జరీ తరువాత కొడాలి నానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున దయ చేసి పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనను కలిసేందుకు హైదరాబాద్ రావద్దని కోరారు. మరో రెండు నెలల్లో కొడాలి నాని పార్టీ శ్రేణులతోపాటు అభిమానులకు అందుబాటులో ఉంటారని వైసీపీ నేత శశి భూషణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మేరకు వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ పేరుతో మంగళవారం పత్రిక ప్రకటన వెలువడింది.
మరోవైపు కొడాలి నాని ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. ఆయనకు హైదరాబాద్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబై తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఎప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చారో తెలియదు. అయితే ఇటీవల ఓ ఫంక్షన్కు కొడాలి నాని హాజరైనట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయినాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందంటూ గుడివాడ నియోజకవర్గంలో ఒక చర్చ అయితే సాగుతోంది. ఈ నేపథ్యంలో కొడాలి నానిని పరామర్శించేందుకు నియోజకవర్గంలోని ఆయన అభిమానులు హైదరాబాద్ తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని సన్నిహితుడు, వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.