ఉగ్రవాదం అంటే ఏంటో తెలియదు, మేము చాలా నిజాయితీగా ఉంటాం, భారత్ కావాలనే మాపై దాడి చేస్తుందంటూ.. పూటకో మాట మాట్లాడే పాకిస్థాన్ రక్షణ మంత్రి మరోసారి నోరు జారారు. ముఖ్యంగా ఆ దేశం ఎంతటి నీచానికైనా పాల్పడేందుకు సిద్ధం అనేది.. ఆయన మాటల్లో మరోసారి నిరూపితం అయింది. ముఖ్యంగా భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో తమకు సైన్యం సరిపోకపోతే.. మదర్సాలో చదువుతున్న విద్యార్థులను రంగంలోకి దింపుతామని వెల్లడించారు. వారినే తమ రెండో శ్రేణి రక్షణ కవచంగా వాడుకుంటామని వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతర్జాతీయ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంట్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. తన దేశ సైన్యం గురించి వివరించారు. మదర్సాలో చదువుతున్న విద్యార్థులను భారత్పై దాడి చేసేందుకు రంగంలోకి దింపుతామని వెల్లడించారు. ముఖ్యంగా వారిని తమ రెండోశ్రేణి రక్షణ కవచంగా వాడుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతర్జాతీయ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అసలు పిల్లలను ఇందులోకి లాగడం ఏంటని, వారి చేతులకు మారణాయుధాలు ఎలా ఇస్తారంటూ అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం రోజు అర్థరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అయితే ఈ ఘటనలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు భారత సర్కారు వెల్లడించింది. కానీ పాక్ మాత్రం.. తమ పౌర నివాసాలపైనే భారత్ దాడులు చేసిందని ఆరోపించింది. ఇందుకు గట్టిగా బదులిస్తామని కూడా వెల్లడించింది. అయితే ముందు నుంచి భారత్పై అసత్య ప్రచారాలు చేస్తూ.. నోరు పారేసుకుంటున్న ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. తమ దేశంలో ఉగ్రవాదులే లేరని ఒకసారి, అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని మరోసారి చెప్పుకొస్తున్నారు.