దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ బుధవారం ఉదయం 11:15 గంటలకు పుణ్యస్నానం చేశారు. తద్వారా 144 ఏళ్లకు వచ్చే మహా కుంభమేళాలో పాల్గొన్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రముఖులు, విదేశీయులు సైతం ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళాలో పాల్గొన్నారు. కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తే దోషాలు తొలగిపోయి, అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రధాని మోదీ మహాకుంభమేళాకు వచ్చిన సందర్భంగా అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. త్రివేణి సంగమం వద్ద సైతం పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఉదయం 11-11.30 గంటల మధ్య పుణ్యస్నానం
ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న కుంభమేళాకు వస్తారని షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యూపీలోని ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన ప్రధాని మోదీ బుధవారం ఉదయం 10 గంటలకు ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అటు నుంచి అరైల్ ఘాట్కు వెళ్లారు. అరైట్ ఘాట్ నుంచి యూపీ సీఎం ఆదిత్యానాథ్ మరికొందరితో కలిసి బోటులో ప్రయాణించి కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమానికి ప్రధాని మోదీ చేరుకున్నారు.
త్రివేణి సంగమంలో ఉదయం 11.15 నుంచి 11.30 గంటల ప్రాంతంలో మోదీ ఫుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలలో మోదీ పాల్గొన్నారు. అనంతరం లాంచీలో త్రివేణి సంగమం నుంచి అరైల్ ఘాట్కు చేరుకోనున్నారు. ఘాట్ నుంచి మోదీ ప్రయాగ్ రాజ్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరనున్నారు.