టాలీవుడ్ టాప్ హీరో మహేష్బాబుతో సినిమా తీయాలని ప్రతి ఒక్క దర్శకుడికి ఉంటుంది. అయితే అది కేవలం టాలీవుడ్ మాత్రమే కాదండోయ్ ప్రస్తుతం ఓ తమిళ దర్శకుడు కూడా ఆశపడుతున్నాడు. మహేశ్ బాబుతో సినిమా తీయాలన్న కోరిక ఉందని, ఆయన ఒక్క చాన్స్ ఇస్తే చాలని తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తన మనసులో మాటను బయటపెట్టారు. మహేశ్ బాబుతో తను ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నాడో కూడా మారిముత్తు వివరించారు.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ ఈ నెల 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అశ్వత్ మాట్లాడుతూ.. మహేశ్ బాబుతో సినిమా తీయాలన్న కోరిక తనకు ఉందని చెబుతూ అందుకు గల కారణాన్ని వివరించారు.
2020 లో తన ట్విట్టర్ అకౌంట్కు ఎప్పుడూ లేనన్ని వ్యూస్ వచ్చాయని, తనకు అప్పుడు ఏమైందో అర్ధం కాలేదన్నారు. తాను దర్శకత్వం వహించిన ‘ఓష్ మై కడవలే’ సినిమా బాగుందంటూ మహేశ్ ప్రశంసిస్తూ పోస్టు పెట్టారని, అందుకే నా సోషల్ మీడియా అకౌంట్ ఫేమస్ అయిందని తర్వాత తెలిసిందన్నారు. వాస్తవానికి అది చాలా చిన్న సినిమా, కేవలం మూడు కోట్ల రూపాయలతో రూపొందించామని చెప్పారు.
తాము అడగకుండానే మహేశ్ ఈ సినిమా గురించి పోస్టు పెట్టారన్నారు. ఆ తర్వాత తెలుగు దర్శకులు, నటీనటులు ఎంతో మంది దాన్ని చూసి తమ టీమ్ను అభినందించారన్నారు. అప్పటి నుంచి మహేశ్ ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అతనితో సినిమా తీయాలని అనుకుంటున్నానని అశ్విత్ తన మనసులోని మాట బయటపెట్టారు.