కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం..కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్తో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల భేటీ.
కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్తో బిఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆయనతో పాటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డికె శివకుమార్ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ను సైతం మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అడిగినట్టుగా తెలిసింది. కాంగ్రెస్లో చేర్చుకునేందుకు రాష్ట్ర నేతలైన సిఎం రేవంత్ రెడ్డి సహా మైనంపల్లి వంటి నేతలంతా నిరాకరిస్తుండగా డికె శివకుమార్ ద్వారా మల్లారెడ్డి పైరవీలు చేస్తున్నారంటూ వార్తలు వెలువడడంతో ఈవార్తకు ప్రస్తుతం ప్రాధాన్యత చేకూరింది. ఇటీవల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి కలిసిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం డికెతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయను: మాజీ మంత్రి మల్లారెడ్డి
తాజాగా డికెతో భేటీపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం విలేకరులతో పేర్కొన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో డిప్యూటీ సిఎం డికె శివకుమార్ను కలిసినట్లు ఆయన తెలిపారు. తాను బిఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. డికె శివకుమార్ను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు. వ్యాపారాల విషయంలో రెండ్రోజుల క్రితమే డికె శివకుమార్ను కలిశానని మల్లారెడ్డి తెలిపారు. వేరే పార్టీల నుంచి మా కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరన్నారు. డికె శివకుమార్ తనకు ఆప్తమిత్రుడు అని ఆయన అన్నారు. ప్రస్తుతం తనకు 71 సంవత్సరాలు ఉన్నాయని, ఈ వయస్సులో పార్టీలు మారి తాను సాధించబోయేది ఏమీ లేదని ఆయన వెల్లడించారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని, ఇంకో ఐదారేళ్లు మాత్రమే రాజకీయాల్లో ఉంటానని ఆయన తెలిపారు.