ఇరు దేశాల మధ్య కాల్పుల విరణమ ఒప్పందం కుదిరినా… భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్లోని భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందిపై బహిష్కరణ వేటు వేసింది. గూఢచర్యానికి పాల్పడారనే ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ రాయబారి కార్యాలయంలోని ఉద్యోగిని భారత్ బహిష్కరించింది. భారత్ ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే పాకిస్థాన్ స్పందించింది. పాకిస్థాన్లోని భారతీయ రాయబార కార్యాలయంలోని సిబ్బందిపై గురువారం బహిష్కరణ వేటు వేసింది. 24 గంటల్లో పాక్ విడిచి వెళ్లాలని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని ఆదేశించింది. మే 13వ తేదీన గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై భారత్లోని పాక్ రాయబారి కార్యాలయ అధికారిని దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజాగా బుధవారం మరో పాక్ అధికారిని దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించడంతో.. పాక్ ఈ తరహా చర్యకు దిగిందనే చర్చ జరుగుతుంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్లోని పాకిస్థాన్ రాయబారిని సైతం దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు పాక్ రాయబారికి వారం రోజుల గడువు విధించిన విషయం విదితమే. అలాగే దేశంలోని పాకిస్థానీలంతా భారత్ విడిచి వెళ్లాలంటూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు వారికి గడువు సైతం విధించిన విషయం విదితమే. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనకు కర్మ, కర్త, క్రియ పాకిస్థాన్ అని భారత్ స్పష్టమైన ఆధారాలను భారత్ సేకరించింది. దీంతో భారత్ పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఆ క్రమంలో ఇరు దేశాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అనంతరం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేసింది. అందుకు ప్రతిగా భారత్ సరిహద్దులోని రాష్ట్రాలపైకి డ్రోనులు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో27 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.