- బిజెపి ఎంపి డికె అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
- డికె అరుణ మాట్లాడిన తీరు అవగాహన రహిత్యంగా ఉంది
- నాగర్కర్నూల్ ఎంపి, మల్లు రవి
బిజెపి ఎంపి డికె అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సార్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారని నాగర్కర్నూల్ ఎంపి, మల్లు రవి పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు రాబోయే ఎన్నికలు తమ ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు. ప్రజలు తమకు 8 ఎంపి సీట్లు, ఒక ఎమ్మెల్యే సీటు గెలిపించి తమకు మద్దతుగా నిలిచారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు వస్తే ఈ సారి సుమారు 41 శాతం ఓట్లు వచ్చాయన్నారు. డికె అరుణ మాట్లాడిన తీరు అవగాహన రహిత్యంగా ఉందన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అనడం డికె అరుణ మూర్ఖత్వమన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్నింటిలో సక్సెస్ అయ్యారన్నారు. ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చి 5 గ్యారంటీలు అమలు చేసి తన పాలన పట్ల ప్రజల నుంచి మంచి మార్కులు పొందారని, అందుకే రేవంత్ రెడ్డికి ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారన్నారు.