మన్నారా చోప్రా ప్రియాంక చోప్రా కజిన్ అయినా కానీ, ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ అవకాశం ఇచ్చింది గనుక ఈ పరిశ్రమపై మన్నారాకు ప్రేమాభిమానాలు, గౌరవం ఉన్నాయి. కొన్నేళ్లుగా మన్నారా నిరంతరం ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు ముంబై ప్రయాణిస్తుంది. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. తన ప్రయాణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మన్నారా చోప్రా ఆదివారం ఉదయం ముంబై విమానాశ్రయంలో సమయానికి రెడీగా ఉన్నప్పటికీ జైపూర్కు వెళ్లే తన విమానం ఎక్కేందుకు అనుమతి నిరాకరించారని ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు.
మన్నారా విమానాశ్రయ సిబ్బందితో వాదించి, తన పేరు ప్రకటించలేదని పేర్కొంది. కానీ నెటిజన్లు మన్నారా ఓవరాక్షన్ చేస్తోందని విమానాశ్రయంలో గొడవ సృష్టించిందని విమర్శించడం కొసమెరుపు. విమానం ముందు తాను ఉన్నప్పటికీ ఎయిర్లైన్స్ సిబ్బంది తనను విమానం ఎక్కనివ్వలేదని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోకు నెటిజనులు వేగంగా స్పందించారు. తాను బోర్డింగ్ గేట్ ముందు కూర్చున్నానని, కానీ తన పేరును ప్రకటించకపోవడంతో, తాను విమానం ఎక్కలేకపోయానని మన్నారా పేర్కొంది. తాను పరిష్కారం కోరినప్పుడు ఎయిర్లైన్స్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని మన్నారా ఆరోపించింది. `ఈ ప్రవర్తన ఏమిటి?` అంటూ వీడియోలో అరుస్తూ కనిపించింది.
అంతే కాదు.. విమానం షెడ్యూల్ సమయానికి 15 నిమిషాల ముందే బయలుదేరిందని మన్నారా పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయంలో అదే విమానయాన సంస్థతో ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నానని తెలిపింది. అయితే మన్నారాకు నెటిజనుల నుంచి మద్ధతు లభించలేదు. మన్నారాతో పాటు వచ్చిన ఒక మహిళ “మన్నారా పెద్ద సెలబ్రిటీ కాబట్టి.. ఆమె దేశానికి సేవ చేస్తోంది! కాబట్టి ఎయిర్లైన్స్ సిబ్బంది ఆమె పేరును ప్రకటించాల్సిందని పేర్కొనడంతో అది మరింత ఫైరింగ్ కి ఆజ్యం పోసింది. మన్నారాపై నెటిజనులు వెకిలిగా కామెంట్లు చేసారు.