- ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్- 8మంది మావోయిస్టుల మృతి
- నక్సల్స్ కు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు
ఛత్తీస్గఢ్- కాల్పులు, ఎన్ కౌంటర్లతో ఛత్తీస్ గడ్ దద్దరిల్లుతోంది. వారం రోజులు గడవక ముందే ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణ్పుర్, బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారని తెలుస్తోంది.
నక్సల్స్ తో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు జవాన్ మరణించగా మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని నారాయణ్పుర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన పోలీసులు, భద్రతా దళాల ఉమ్మడి బృందం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు. గత కొన్ని రోజులుగా మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి భద్రతా దళాలు.