-
హైదరాబాద్ పరిధిలో నీటి కొరత సృష్టిస్తే సిబ్బందిపై వేటు వేస్తాం
-
ఇప్పటికే ముగ్గురు లైన్మెన్లను సస్పెండ్ చేశాం
-
మరో ఏడుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం
-
వాటర్బోర్డు అధికారులను హెచ్చరించిన
-
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్
హైదరాబాద్ పరిధిలో నీటి కొరత సృష్టిస్తే సిబ్బందిపై వేటు వేస్తామని, ఇప్పటికే ముగ్గురు లైన్మెన్లను సస్పెండ్ చేశామని, మరో ఏడుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని వాటర్బోర్డు అధికారులను మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ హెచ్చరించారు. తాగునీరు, ట్యాంకర్ సరఫరా తదితర అంశాలపై వాటర్ బోర్డు ఎండి సుదర్శన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరాలో ఆటంకాలు కల్పిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి చేసిన వారిని తొలగిస్తామని, తాగునీటి సరఫరాలో ఎలాంటి అవంతరాలు ఉండకూడదని ఆయన ఆదేశించారు.
లైన్మెన్ల పనితీరుపై దానకిశోర్ ఆరా
సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్స్ బుకింగ్తో పాటు లైన్ మెన్ల పనితీరుపై దానకిశోర్ ఆరా తీశారు. ప్రతి మేనేజర్, జనరల్ మేనేజర్ లైన్మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లైన్మెన్లు తప్పనిసరిగా నాణ్యత యాప్లో సరఫరా, నాణ్యత వివరాలు నమోదు చేయాలని, వాటిలో తేడా వస్తే సిబ్బందిని తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. వాతావరణంలో చట్టబడటంతో కొంత మేరకు ట్యాంకర్ బుకింగ్స్ తగ్గాయని, అంతకు ముందు రోజుకు 6 వేల ట్రిప్పుల చొప్పున నీటి సరఫరా జరిగితే, ప్రస్తుతం 5 వేల ట్రిప్పుల చొప్పున జరుగుతుందన్నారు.
నాగార్జున సాగర్లో ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు
డిమాండ్ కు అనుగుణంగా మరో 5 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన వంద ట్యాంకర్లు రానున్నాయని, కలుషిత నీటి ప్రభావిత ప్రాంతాలకు సరఫరా చేసేందుకు 2.5 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లను తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీటిని సమర్ధంగా వినియోగించుకొని డెలివరీ సమయాన్ని తగ్గించుకోవాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. నాగార్జున సాగర్ లో ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, 15 వ తేదీ తర్వాత ఏ క్షణమైనా పంపింగ్ చేయవచ్చని ఆయన తెలిపారు.