సార్వత్రిక ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ బిఆర్ఎస్ పార్టీని వీడి శనివారం కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లో సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ వీరికి కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ విజయలక్ష్మితో పాటు ఆమె సోదరుడు వెంకట్ కూడా పార్టీలో చేరారు.
గత జీహెచ్ఎంసి ఎన్నికల్లో గ్రేటర్లోని 150 వార్డుల్లో కేవలం మూడు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయం సాధించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత ఆ సంఖ్య 11కు చేరింది. శనివారం మేయర్ చేరికతో ఆ సంఖ్య 12మందికి చేరింది. ఇక పురాణం సతీష్ కాంగ్రెస్లో చేరడంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణలు కీలక పాత్ర పోషించారు. ఈ చేరికల కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆగం: మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్
బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆగమైందని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఆరోపించారు. ఉద్యమ సమయం నుంచి తాను కెసిఆర్తో ఉన్నానని, ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనని ఆయన పేర్కొన్నారు. బానిస సంకెళ్ల మధ్య ఇంత కాలం ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుపోయిందన్న సతీశ్, కెసిఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆయన విమర్శించారు. యాదాద్రిలో కూడా రూ. 400 కోట్ల స్కామ్ చేశారని అది కూడా రాబోయే రోజుల్లో బయటపడుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలను కెటిఆర్, హరీశ్ రావులు మోసం చేశారని, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు పోతుందని ఆరు గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని ఆయన వివరించారు.