- అమరావతి కోసం 25 లక్షల విరాళం ఇచ్చిన స్టూడెంట్
- పోలవరం కోసం బంగారం అమ్మి మరీ డొనేషన్
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక రాజధాని విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించటంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం విరాళాలు వెల్లువెత్తున్నాయి. ఓ వైద్య విద్యార్ధిని సైతం అమరావతికి విరాళం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.
ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఉండాలని వైష్ణవి చాలా కాలంగా తపిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో అమరావతి నిర్మాణానికి తన వంతు సహాయం అందించాలని వైష్ణవి డిసైడ్ అయ్యింది.
రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళం ఇచ్చేందుకు వైష్ణవి తమకు ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరా అమ్మేయడం విశేషం. ఇలా భూమి అమ్మగా వచ్చిన 25 లక్షల రూపాయలను అమరావతి అభివృద్ది కోసం విరాళం ఇచ్చేసింది వైష్ణవి. అంతే కాదు మరో అడుగు ముందుకేసి పోలవరం నిర్మాణం కోసం తనకున్న బంగారు గాజులు అమ్మేసి మరో లక్ష రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించింది వైష్ణవి.
ఈ సందర్భంగా వైష్ణవిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. వైష్ణవి నేటి యువతకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. వైద్య విద్యార్థిని వైష్ణవి చంద్రబాబు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా
రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైష్ణవిని నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.