కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగి, పియర్లు దెబ్బతిన్న ఘటనలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. తొలుత మేడిగడ్డపై విచారణ చేసి ప్రాథమిక నివేదిక సమర్పించింది. అనంతరం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల సీపేజీపైనా విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆ నివేదిక నీటి పారుదల శాఖకు రావడంతో తదుపరి కార్యాచరణపై అధికారులు చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై వివరంగా నివేదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా 17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. అందులో అంతా మేడిగడ్డతో సంబంధం ఉన్నవారేనని తెలిసింది.
నిర్మాణంతో పాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పని చేసిన ఇంజినీర్లు ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో పాటు గతంలో ఎస్ఈగా పని చేసిన రమణా రెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతి రావు తదితరులున్నట్లు సమాచారం. నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజినీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి, వారిపైనా కేసులకు సిఫార్సు చేసినట్లు సమాచారం. మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి తదితరులపైనా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా, శాఖాపరమైన చర్యలా, క్రిమినల్ చర్యలా అన్నది తెలియాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణలో మరమ్మతులు చేయాలని ఇంజినీర్లు లేఖ రాసినా పట్టించుకోలేదని, డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్లో ఉండి చర్యలు తీసుకోలేదని నిర్మాణ సంస్థపైనా చర్యకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా, ఏం చర్యకు సిఫార్సు చేశారన్నది వెల్లడి కావాల్సి ఉంది.
30 మందిలో డీఈఈ, ఏఈఈలు
శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన 30 మందిలో వివిధ విభాగాలకు చెందిన డీఈఈ, ఏఈఈలు ఉన్నట్లు తెలిసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్న ఇంజినీర్లను పదోన్నతులకు పరిశీలనకు తీసుకోవాలా లేదా అన్నదానిపై నీటి పారుదల శాఖ తర్జన భర్జన పడుతోంది. ఇటీవల చీఫ్ ఇంజినీర్ల నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్లకు పదోన్నతులపై డీపీసీ సమావేశమై తొమ్మిది మంది పేర్లు సిఫార్సు చేసింది. ఇందులో గతంలో కాళేశ్వరం మొదటి లింకులో ఎస్ఈగా పని చేసి, ప్రస్తుతం రామగుండం చీఫ్ ఇంజినీర్గా ఉన్న సుధాకర్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎస్ఈల నుంచి సీఈలకు పదోన్నతులు కల్పించేందుకు డీపీసీ సమావేశం జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక నేపథ్యంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకొన్న తర్వాతే డీపీసీ నిర్వహించే అవకాశం ఉంది.