మెగాస్టార్ తో దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణం జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక దీని ప్రత్యేకత ఏమిటంటే .. చాలా ఏళ్ల తర్వాత పల్లెటూరి అందాల నడుమ ఈ చిత్ర నిర్మాణం చేయనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సీజన్కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వినోదానికి ఏ మాత్రం కొదవ ఉండబోదని ఇప్పటికే నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా అదితి రావు హైదరీ నటించనున్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాంబో అయిన సంగీత దర్శకులు భీమ్స్, రమణ గోగుల ఈ మూవీకి పని చేయనున్నారని అంటున్నారు.
ఇటీవలే నిర్మాణ సంస్థ సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ కు పూజలు చేయించారు. ఇప్పటి వరకూ రంగు రంగుల సెట్టింగ్లు, హైటెక్ హంగులతో చిత్ర నిర్మాణాలు స్టూడియోలలోనే చేయగా, ఇప్పుడు గతంలో మాదిరి పల్లెటూరి అందాల నడుమ చిత్ర నిర్మాణం చేయనున్నారు. ఇక ఈ విషయం పక్కన పడితే చిరంజీవి కామెడీ చేయడంలో దిట్ట. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి అనిల్ కామెడీ ఏవిధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నం’ చిత్రం కలెక్షన్స్ పరంగా హిట్ కొట్టినప్పటికీ మరోవైపు కాస్త నెగిటివ్ టాక్ కూడా మూటగట్టుకుంది. ఇందులోని కామెడీ కాస్త హద్దులు దాటిందని చిన్న పిల్లాడితో కాస్త ఓవర్ డైలాగులు మాట్లాడించాడని అనిల్పై ఓ వర్గం ప్రేక్షకులు మండిపడ్డారు. మరి చిరుతోనైనా సరైనా కామెడీ మూవీ చేస్తాడా లేక ఇదీ అంతేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.