ఎన్నికల కోడ్ ముగియగానే ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తాం
రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మంత్రి జూపల్లి మాట్లాడారు.. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల మాటలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ లో పెట్టిందని ఆయన మండిపడ్డారు. రైతు భరోసాకు సంబంధించి రూ.6వేల కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలోనే జరిగాయన్నారు. ఈ నెలలోనే రూ.370 కోట్ల చెల్లింపులు చేశామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో లిక్కర్ కొరత అనేది ఉంటే ప్రభుత్వానికే నష్టం వస్తుందని, ప్రజలకు కాదన్నారు. లిక్కర్ ను బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్ శాఖ కేసులను కూడా నమోదు చేసిందన్నారు. మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టమని, ప్రజలకు కాదని అన్నారు. లిక్కర్ ను బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసిందన్నారు. లిక్కర్ తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో ఎక్సైజ్ శాఖలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావని, ఇప్పుడు అలాంటివేవీ లేకుండానే పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని మంత్రి జూపల్లి తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఆయన వెల్లడించారు.