పార్లమెంట్ ప్రాంగణంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. అందుకోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని ఆమె కోరారు. గురువారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద జరిగిన అల్లూరి సీతారామ రాజు 127 వ జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీతారామ రాజు విగ్రహానికి పూలమాలలు వేసి సీతక్క నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అల్లూరి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. దేశాన్ని పట్టి పీడీచించిన బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు అల్లూరి అని అన్నారు.
బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన మహనీయుడు అల్లూరి అని కొనియాడారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి అమరజీవి అయిన అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు.