తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును ఇవాళ(శనివారం) నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. 2017 ఆగస్టు 23వ తేదీన పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ పోలీస్స్టేషన్లో శ్రీధర్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. శ్రీధర్ బాబుతో పాటు 300 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరంతో రైతులు నష్టపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. న్యాయస్థానాలపైన తమకు నమ్మకం ఉందని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో పెట్టిన ఈ కేసు ఎప్పటికీ నిలువదని అన్నారు. భూములు కోల్పోయిన రైతుల పక్షాన తాము నిలబడ్డామని తెలపారు. న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేయడం జరిగిందని.. ఇది రైతుల విజయమని అన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసులు అడ్డగోలుగా రైతుల మీద లాఠీఛార్జ్ చేశారని, అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని ఉద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం కట్టిన రైతులకు ఉపయోగపడలేదని… ఈ ప్రాజెక్టు ఎంతోకాలం నిలవలేదని అన్నారు. కాళేశ్వరంపైన కమిషన్ విచారణ చేస్తోందని స్పష్టం చేశారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఈ కేసులో శిక్ష పడుతుందని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపణలు చేశారు.