ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ఇలా ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే పుష్కరకాలం క్రితం మిస్ యూనివర్స్ ఇండియా పోటీలు హైదరాబాద్లో జరిగాయి. 2012లో ఐయామ్ షీ పేరుతో నిర్వహించిన ఈ పోటీలకు శామీర్పేటలోని లియోనియో రిసార్ట్ వేదిక అయింది. అందాల పోటీలు, ఫ్యాషన్ షోలకు మనదేశంలో ముంబయి పేరొందింది. మిస్ ఇండియాతో సహా ఎలాంటి అందాల పోటీలైనా అక్కడే నిర్వహిస్తారు. ఈ క్రమంలో 2012లో మొదటిసారి ముంబయి వెలుపల నిర్వహించాలనుకున్నారు. అందుకు హైదరాబాద్నే ఉత్తమమైన నగరం అని అనుకుంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 18 ఏళ్లు నిండి 27 ఏళ్లలోపు ఉన్న అందగత్తెలను స్క్రీనింగ్ చేసి టాప్ 20 మందిని ఆనాడు ఎంపిక చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా శిక్షణ : అందాల కిరీటాన్ని అందుకోవాలని కలలు కనేవారిలో అందరూ దాదాపు కొత్తవాళ్లే ఉంటారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వీరిని తీర్చిదిద్దేందుకు నాడు ఓ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిస్ యూనివర్స్-1994 విజేత, ఐయామ్ షీ వ్యవస్థాపకురాలు సుస్మితాసేన్ మెంటార్గా వ్యవహరించి వారికి గ్రూమింగ్ నిర్వహించారు. ఆహారపు అలవాట్ల నుంచి ఫిట్నెస్, చర్మ, కేశ సౌందర్యం వరకు, ర్యాంప్పై నడక నుంచి నృత్యం వరకు మెరుగులు దిద్దారు. అలాగే వీరికి దేశంలో పేరొందిన ఫ్యాషన్ నిపుణులు, బాలీవుడ్ ప్రముఖులు తర్ఫీదు ఇచ్చారు. ఎన్నో మెలకువలు నేర్పారు. టాప్ 20లో తెలుగు మోడల్ కూడా ఒకరు పోటీపడ్డారు. అయితే చివరి దశకు చేరుకోలేపోయింది ఆమె.
నాడు ముగ్గురు ఎంపిక
మొత్తం 20 మందికి వివిధ రౌండ్లలో పోటీలు నిర్వహించి అత్యుత్తమంగా నిలిచిన ముగ్గుర్ని తుది పోటీలకు ఎంపిక చేశారు. వీరిలోంచి ఒకరిని మిస్ యూనివర్స్కు, మరొకరిని మిస్ గ్లోబ్ ఇంటర్నేషనల్కు, ఇంకొకరిని మిస్ ఏషియా పసిఫిక్ వరల్డ్-2013కు పంపించారు. ఆ ఏడాది ఉత్తరాఖండ్కు చెందిన ఊర్వశి రౌతేలా మిస్ ఇండియా యూనివర్స్గా ఎంపిక అయ్యారు. తొలి రన్నరప్గా బిహార్కు చెందిన శిల్పాసింగ్, రెండో రన్నరప్గా మహారాష్ట్రకు చెందిన అర్లెట్టీ ఎవిటా గ్రావో ఎంపిక అయ్యారు. అయితే, రౌతేలా వయసు సరిపోకపోవడంతో శిల్పాసింగ్ను భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీలకు పంపించారు.