మిస్ వరల్డ్ – 2025 ఫైనల్ పోటీలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. క్వార్టర్ ఫైనల్కు చేరిన నలభై మంది అందాల భామలు ఫైనల్లో ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడతారు. ఇప్పటివరకు స్పోర్ట్స్ ఛాలెంజ్లో ఒకరు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో నలుగురు, టాలెంట్ ఛాలెంజ్లో ఒకరు, బ్యూటీ విత్ ఏ పర్పస్ విభాగం నుంచి నలుగురు, టాప్ మోడల్ పోటీల్లో నలుగురు, మొత్తం 14 మంది విజేతలై ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో క్వార్టర్స్కు చేరారు. మిగతా 26 మందిని అమెరికా-కరేబియన్, యూరప్, ఆఫ్రికా, ఆసియా-ఓషియానా ఖండాల వారీగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేయనున్నట్లు మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు.
ఇండోనేసియా, వేల్స్ భామలు 2 పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఆ ప్రకారం టాప్-40లో ఇప్పటివరకు 12 బెర్త్లు మాత్రమే ఖరారయ్యాయి. అంటే ఇంకా 28 మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. టాప్ 40లో కూడా ఒక్కో ఖండం నుంచి 10 మంది ఉండేలా ఎంపిక చేస్తారు. ఆ తరువాత రౌండ్లో వీరిలోంచి టాప్ ఇరవై మందిని తీసుకుంటారు. ఒక్కొక్క ఖండం నుంచి ఐదు మంది ఉంటారు. ఇక అంతిమ ఘట్టానికి ముందు టాప్ 8 అంటే ఒక్కో ఖండం నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఆ తరువాత ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరే అంటే నలుగురు అంతిమంగా కిరీటం కోసం మిగులుతారు. వీరిలో ఒకరు విజేతగా, మిగిలిన ముగ్గురు 1, 2, 3 రన్నరప్గా నిలుస్తారు.
ఈ నెల 31న జరిగే మిస్ వరల్డ్ – 2025 ఫైనల్
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్లో నూతనంగా నిర్మించిన నాలుగో హాల్లో ఈ నెల 31న జరిగే మిస్ వరల్డ్ – 2025 ఫైనల్ పోటీలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ విభాగం, సైబర్ పోలీసులు, పర్యాటక శాఖ, నిర్వాహకులు ఈ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హాల్ సామర్థ్యం 3,500 మంది కావడంతో అంతమంది అతిథులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మిస్ వరల్డ్ – 2025 ఫైనల్ వేడుకలు సాయంత్రం నుంచే ప్రారంభమవుతాయి. తుది పోటీలు రాత్రి పది నుంచి అర్ధరాత్రి వరకు జరగనున్నాయి.