- ఉచితంగా ఎల్ఆర్ఎల్ చేస్తామని మాట తప్పారు
- రైతు రుణమాఫీలోనూ మోసాలు
- అందరికీ అందని రైతు భరోసా సాయం
- శాసన సభ చర్చల్లో మాజీమంత్రి హరీష్ రావు
రేవంత్రెడ్డి సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారని.. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని అన్నారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రుణమాఫీకి రూ.31 వేల కోట్లు సమీకరించుకున్నట్లు చెప్పారని, రూ.20 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. శాసన సభలో బడ్జెట్పై చర్చను హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడాది బడ్జెట్ రూ.2 లక్షల 91 వేల 159 కోట్లు అని గొప్పగా చెప్పుకున్నారు. ఇవి అవాస్తవిక అంచనాలని నేను ఆనాడే చెప్పాను. వారు కాదు పొమ్మన్నారు. రివైజ్డ్ ఎస్టిమేషన్లో రూ.27 వేల కోట్లు తక్కువ చేసి చూపారు. ముఖ్యమంత్రేమో రూ.60 నుంచి రూ.70 వేల కోట్లు తక్కువగా వొస్తాయని స్వయంగా చెప్పారు.
అంటే అంచనా అవాస్తవమని తేలిపోయింది. ఈ కొటేషన్ ఎవరు చెప్పారో గానీ కాంగ్రెస్ కోసమే చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసింది లేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేం ఇచ్చిన రూ.5 లక్షలకు మించి పెంచింది లేదు. ఇదే శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా రూ.5 లక్షల వరకే వడ్డీ అందుతుందని ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. కానీ మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం అని ప్రచారం చేసుకుంటున్నారు. నేను డిప్యూటీ సీఎంను సూటిగా అడుగుతున్నా.. మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వీఎల్ఆర్ వర్తిస్తుందనే ఉత్తర్వులు ఉంటే చూపండి. లేదా ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసిందనందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామన్న సంకల్పం ఏమైంది. రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కౌలు రైతులను రైతులే చూసుకోవాలంటున్నారు.
ఈసారి బడ్జెట్లో అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టు కూలీ రూ.50 నుంచి రూ.75కు పెంచి ఇచ్చినట్లు చెప్పారు. రూ.75 కుట్టు కూలీ ఇచ్చిన మహిళా సంఘం పేరు చెప్పాలని లేకపోతే క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 4.5 లక్షల ఇండ్లు కాదు కాదా.. 4 ఇండ్లు కూడా కట్టలేదు. ఎస్సీ, ఎస్టీల ఇండ్లకు రూ.లక్ష అదనంగా కలిపి రూ.6 లక్షలు ఇస్తామన్నారు. ఈ సారి ప్రసంగంలో రూ.లక్ష మాయమైంది. దళిత, గిరిజనులను ప్రభుత్వం మో సం చేశారు. ఫసల్ బీమాకు రూపాయి ఇవ్వలేదని, ఫసల్ బీమా చేయట్లేదు. జాబ్ క్యాలెండర్.. జాబ్లెస్ క్యాలండర్ అయింది. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగానికి మా ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చామన్నారు. భూసేకరణకు రూ.1,525 కోట్లు పెట్టామని గత బడ్జెట్లో చెప్పారు. ఏడాదైనా ఒక్క ఎకరా సేకరింలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని గత బడ్జెట్లో చెప్పారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి.. ఎంత ఆయకట్టుకు నీళ్లిచ్చారో చెప్పాలి. ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, పంటలకు బోనస్ ఇస్తామని మోసం చేశారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, విద్యార్థులకు భరోసా కార్డు పేరుతో మోసం చేశారు. ఆదాయం పెంచి హామీలు నెరవేరుస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యం వల్ల రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడింది. రాష్ట్ర ఆదాయం క్షీణిస్తున్న సమయంలో ఏం చేయాలో భట్టి విక్రమార్క చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలు సరిచేసుకోవాలి లేదా రేవంత్రెడ్డి ఫార్ములా ప్రకారం భూములు అమ్మాలి. ఎనుముల వారి పాలనలో ఎన్ని భూములు ఖతం పట్టిస్తారో తెలియదు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముని వేలం చేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. టీజీఐఐసీ భూములు తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారు. హెచ్ఎండీఏ భూములు తాకట్టుపెట్టి రూ.20 వేల కోట్లు అప్పు తెస్తామని చెప్పారు. ఆ రోజు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తుంటే ఆ రోజు అక్కడ భట్టి విక్రమార్క, సీతక్క పాదయాత్ర చేసి భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.