•రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో జిడిపి తగ్గుముఖం
•మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో జిడిపి భారీగా తగ్గుతోందని.. ఇది తెలంగాణ రైజింగ్ కాదు.. తెలంగాణ ఫాలింగ్ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ఇది మరో నిదర్శనమన్నారు. గత ఆరేళ్లలో ఫిబ్రవరి నెల జిఎస్టి కలెక్షన్ వృద్ధి రేటు (2021 కరోనా సంవత్సరం మినహా) ఎప్పుడూ 6% కంటే ఎక్కువే నమోదైంది. కానీ రేవంత్ రెడ్డిపాలన కరోనా సమయాన్ని తలపిస్తూ 1% మాత్రమే నమోదు చేసింది. కాంగ్రెస్ పాలనలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తికి అద్దం పడుతున్నది హైడ్రా, మూసీ వంటి తలా తోక లేని నిర్ణయాలు, అనాలోచిత చర్యల వల్ల ఆగష్టు 2024 తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణీయంగా తగ్గింది.
2024 ఏప్రిల్ – నవంబర్, 2023 ఎప్రిల్ – నవంబర్ మధ్య కాలంలో వాహన విక్రయాలు పోల్చితే -0.8 % నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిఎస్టి ఆదాయంలో తక్కువ వృద్ధి రేటు, రిజిస్ట్రేషన్లు, వెహికిల్ టాక్స్ లో నెగెటివ్ వృద్ధి రేటు రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని ఎండ గడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పి – పాలన పై శ్రద్ధ వహించాలని ఆయన డిమాండ్ చేశారు.