అబద్ధాలు చెప్పి తనపై తప్పుడు ఆరోపణలు చేయడం మహేశ్వర్ రెడ్డికే చెల్లింది
బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాను చెప్పని మాటలను చెప్పినట్టు అబద్ధాలు చెప్పి తనపై తప్పుడు ఆరోపణలు చేయడం మహేశ్వర్ రెడ్డికే చెల్లిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మొన్నటిదాక కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, సాయం చేయమని తనను అడిగిన బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోజు తనపై కామెంట్లు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. తాను కాంగ్రెస్లోకి వస్తా అన్నా, మంత్రి పదవి కావాలని బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనను అడిగారని, మాకే సరిపడా మెజార్టీ ఉందని, ఎవ్వరిని చేర్చుకోవాలన్న ఉద్దేశం పార్టీకి లేదని తాను చెప్పానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని మహేశ్వర్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడని కోమటిరెడ్డి ఆరోపించారు. తాను మహేశ్వర్ రెడ్డికి ఒక్కటే సవాల్ చేస్తున్నానని, ఆయనకు దమ్ముంటే నితిన్ గడ్కరిని, అమిత్ షాను తీసుకొని భాగ్యలక్ష్మీ టెంపుల్కు తీసుకురావాలని, తాను కూడా వస్తానని ప్రమాణం చేద్దామని ఆయన పేర్కొన్నారు. ఐదేండ్లకో పార్టీ మారే గాలిమాటల మహేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి జెండా మార్చని నాపై విమర్శలు చేస్తవా అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యం, కాంగ్రెస్, బిజెపి, మధ్యలో బిఆర్ఎస్తో టచ్లో ఉన్నారని, ఇలా ఆయన పోనీ పార్టీ ఈ రాష్ట్రంలో లేదన్నారు.