సొంత పార్టీ నేతలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తమ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని, ఎంత చెప్పినా పనితీరు మారడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పదవులను టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మీడియాతో చిట్చాట్ చేసిన సీఎం.. కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్లకు పదవులు రాలేదని నోరుజారుతున్నారని, అలాంటి వాళ్లకు అవకాశాలు ఉండవు.. పదవులు కూడా రావన్నారు. ఇక, మరికొంతమంది తమ పార్టీ ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని, సీఎల్పీలో చెప్పినా ఎమ్మెల్యేల పనితీరు మారడం లేదని. తమ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో టైమ్పాస్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. పదవులు వాటంతట అవే వస్తాయని, చేస్తున్న పనిని గుర్తించాలని, తాను అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాను.. ఇప్పించానని సీఎం రేవంత్ చెప్పారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని రేవంత్ హెచ్చరించారు.
కాగా, కేసీఆర్ ఏవో సభల్లో.. అక్కడో ఇక్కడో విమర్శలు చేయడం కాదని, అసెంబ్లీకి వచ్చి చేయాలన్నారు. కేసీఆర్ చేసిన విధ్వంసంతోనే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తాను వెళ్లి పరామర్శించానని, ఎవరూ చావును కోరుకోరు అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాము చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుకపడ్డామని, స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని, అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు.