తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ నెల 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల అధికారులుగా నల్లగొండ కలెక్టర్ త్రిపాఠి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వ్యవహరించనున్నారు.
ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నాలుగు జిల్లాల్లో కలిపి 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ముగ్గురు థర్డ్ జెండర్లు కూడా ఉన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. అంటే డిగ్రీ అర్హత కలిగిన విద్యావంతులు మాత్రమే ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుంది. గతంలో ఈ స్థానానికి మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ స్థానానికి అల్ఫోర్స్ నరేందర్రెడ్డిని బలపర్చాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మరోవైపు గతంలో రెండుసార్లు ఈ స్థానంలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీలో నిలవకూడదని భావిస్తోంది. అయితే పోటీలో నిలిచే ఎవరో ఒక అభ్యర్థికి మద్ధతునిచ్చే అవకాశాన్ని ఆ పార్టీ పరిశీలిస్తోంది. ఇక ఈ జిల్లాల్లో 25,921 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల కోసం 499, ఉపాధ్యాయ ఓటర్లకు 274 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన నామినేషన్లను నల్లగొండ కలెక్టరేట్లో స్వీకరిస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. 24,905 మంది ఓటర్లుండగా.. 191 మండలాల్లో 200 పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేశారు.