రెండు పిటిషన్లు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంఎల్ సి కవితకు మరోసారి చుక్కెదురైంది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె బెయిల్ కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకు బెయిల్ మాత్రం రావడం లేదు. తాజాగా ఆమె దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను కూడా ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమెకు మళ్లీ నిరాశే ఎదురైంది.
ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయిన కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించగా.. ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుమారు 100 రోజులకుపైగానే జైలులో ఉన్న కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించగా..
ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కూడా సేమ్ సీన్ రిపీటయ్యింది. ఈ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయస్థానం.. వాయిదాలు వేస్తూ వస్తోంది. కాగా సోమవారం రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. దీంతో ఆమెకు బెయిల్ రావటం మరింత క్లిష్టంగా మారనుంది.