బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారా..?
బీఆర్ఎస్లో సంచలనంగా మారిన కవిత లేఖ
గులాబీ దళంలో ఒక్కసారిగా సంచలనం రేకెత్తింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ లేఖలో వరంగల్ సభ నిర్వహణపై అసంతృప్తి, బీజేపీపై మరింత బలంగా మాట్లాడాల్సిన అవసరం, బీజేపీతో భవిష్యత్ పొత్తు ప్రచారాలపై ఆందోళన వంటి అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చామనే సందేశాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని, పార్టీకి స్పష్టమైన వ్యూహాలు, ప్లీనరీ సమావేశాలు అవసరమని కవిత రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై “మైడియర్ డాడీ” అంటూ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణ చేశారు.. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని, పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పేర్కొన్నారు. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో ప్రస్తావించారు.
నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసు కదా డాడీ..!
ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగంపై కవిత ఈ లేఖలో అసహనం వ్యక్తం చేశారు. బీజేపీపై కేవలం రెండు నిమిషాలే మాట్లాడటంపై అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డానని, బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత, తనను జైలుకు పంపిన బీజేపీపై ప్రతీకారం తీర్చుకోవాలని తాను భావిస్తున్నానని, అయితే పార్టీ అధిష్టానం (కుటుంబం) తనను అడ్డుకుంటున్నట్లు ఆమె లేఖలో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని, ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారన్నారు. ఇప్పటికైనా 1-2వ ప్లీనరీ పెట్టాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణపై ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం, మోటీవేట్ చేస్తారని ఎదురు చూశారని, ఓవరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారని, పార్టీ లీడర్స్కి యాక్సిస్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత ఇన్ఛార్జ్లకే లోక్ బాడీ బీఫాం ఇస్తారా? 2001 నుంచి పార్టీలో ఉన్న వారిని వేదికపై మాట్లాడనివ్వరా? అని అని లేఖలో నిలదీశారు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేదని, బీసీలకు 42 శాతం కటా అంశాన్ని విస్మరించారని పేర్కొన్నారు. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యామని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పై మాట్లాడటం అందరికీ నచ్చిందని, పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవటం హుందాగా అనిపించిందన్నారు. పహల్గాం మృతులకు నివాళి అర్పించడం బాగుందని, కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పిన తీరు బాగుందని, అలాగే రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం కూడా చాలా మందికి నచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి .. తిడుతున్నా .. తిరిగి తిట్టలేదన్నారు. ఈ మీటింగ్ లో తెలంగాణ ఉద్యమ కారులకు సదుపాయాలు కల్పించలేదని, చాలా నియోజకవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని పేర్కొన్నారు.
అందరికీ అందుబాటులో ఉండాలి
చాలామంది కేడర్, లీడర్స్ మీతో ఫోటో దిగాలని ప్రయత్నిస్తుంటే తనకు గర్వంగా ఉందని, కానీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి లీడర్స్ కూడా మీతో కలిసేందుకు అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారని కవిత లేఖలో స్పష్టం చేశారు. కొంతమంది ఎంపిక చేసుకున్న వారికే మీతో కలిసే అవకాశముంటుందన్న భావన బలంగా ఏర్పడిందని, దయచేసి అందరినీ కలిసేందుకు ప్రయత్నించండని, అందరికీ అందుబాటులో ఉండండని కవిత తన లేఖలో తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు సూచించారు.
అంతర్గత విభేదాలేనా..?
పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, కేవలం కేటీఆర్కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీలోని అంతర్గత రాజకీయాలపై కవిత అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా లేఖ ద్వారా స్పష్టమవుతున్నది. పార్టీ ఆస్తులు, నాయకత్వం కేవలం ఒకరిద్దరికే పరిమితం అవుతున్నాయని ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది. అయితే, కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ లేఖను కొద్ది రోజుల కిందట రాసినట్లుగా తెలుస్తోంది. తాజాగా లీక్ కావడం సంచలనంగా మారుతోంది. కొంత కాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని తనను పక్కన పెట్టారని కవిత భావస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్లీనరీ విషయంలోనూ కవితకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. పైగా వేదికపై మాట్లాడే అవకాశం కూడా రాలేదు. ఈ కారణంగా కవిత మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు.
నిజానికి, ఇలాంటి అభిప్రాయాలు వెల్లడించాలని అనుకుంటే నేరుగా కేసీఆర్ ను కలిసి చెప్పవచ్చు.కానీ లేఖ రాసి..దాన్ని మీడియాకు లీక్ అయ్యేలా చేయడం అంటే.. పార్టీలో అంతర్గత రాజకీయాలు ఓ స్థాయికి చేరుకున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోందది. అయితే, కవిత జైలు నుంచి బయటకు వచ్చాక ఆమెను రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. అన్నయ్య మాటకు విలువ ఇవ్వకుండా కవిత వ్యవహరిస్తుండటంతో కేసీఆర్ దగ్గరకు వెళ్లేందుకు కవితకు డోర్లు క్లోజ్ అయ్యాయని, ఈ కారణంగానే ఆమె లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె వేరు కుంపటికి రెడీ అయ్యే ఈ లేఖ రాసి ఉంటుందని అంటున్నారు.