Sunday, May 4, 2025

మోడీకి వ్యతిరేకంగా దేశంలో సునామీ రాబోతుంది

  • దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
  • యూపీ పరిస్థితిని మోడీ తెలంగాణలో తీసుకురావాలని చూస్తున్నారు
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో సునామీ రాబోతుందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్‌కు తరలించుకుపోవాలని, యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కొడంగల్‌లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, ఎన్డీయే పత్తాలేకుండా పోతుందన్నారు. సౌత్ ఇండియాలో బిజెపికి 15 నుంచి -20 సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికలు మాకు రెఫరెండం అని ఇండియా అలయన్స్ విజయం సాధించబోతుందని సిఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

రైతు బంధు ఎలా ఇచ్చామో పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని, రుణమాఫీ అసాధ్యమైన టాస్క్ కాదని ఆయన తెలిపారు. కెసిఆర్ కేఏ పాల్ మాదిరిగా మాట్లాడుతున్నారని మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారని సిఎం రేవంత్ విమర్శించారు. కెసిఆర్‌పై తనకు సానుభూతి ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.5 శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయన్నారు. 2025తో మోడీకి 75 ఏళ్లు నిండుతాయని వయస్సును అమలు చేస్తే బిజెపిలో ప్రధాని ఎవరో తేల్చుకోవాలన్నారు. బిజెపి మొత్తం 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుందని అలాంటప్పుడు 400 సీట్లు బిజెపికి ఎలా వస్తాయని సిఎం రేవంత్ ప్రశ్నించారు.

ఎవరు నామ్ దార్? ఎవరు కామ్ దార్ ?
నరేంద్ర మోడీ దేశ ప్రజలను మాయ మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని రాహుల్ గాంధీ డిబెట్ కు పిలిస్తే తాము నామ్ దార్ కాదు కామ్ దార్ అని మోడీ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతుంటే మోడీ పేరుతో బిజెపి ఓట్లు అడుగుతోందని సిఎం రేవంత్ ఆరోపించారు. ఇందులో ఎవరు నామ్ దార్? ఎవరు కామ్ దార్ అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీని పప్పు అని హేళన చేశారు. కానీ, అదే పప్పుతో డిబెట్‌కు రమ్మంటే పారిపోతున్నారని సిఎం రేవంత్ విమర్శించారు. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధమన్నారు. దేశంలో మోడీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని రాబోయేది సునామీయేనని ఆయన అన్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బిజెపి, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న బిజెపి 400 సీట్లు ఎలా సాధ్యమని సిఎం రేవంత్ ప్రశ్నించారు.

మోడీ రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు
13 ఏళ్లు సిఎంగా, 10ఏళ్లు పిఎంగా పనిచేసిన మోడీ మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎపిలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఒక వీడియో వైరల్ కేసులో తమపై రంగంలోకి దిగిన ఎంహెచ్‌ఏ మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్ చేసినా బిజెపి నేతలపై ఎంహెచ్‌ఏ ఫిర్యాదు చేయదని సిఎం రేవంత్ దుయ్యబట్టారు. ఏజెన్సీలను బిజెపి దుర్వినియోగం చేస్తుందనడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు.

ఈడీ, సిబిఐ, ఎన్‌ఐఏలను బిజెపి అడ్డుపెట్టుకొని….
బిజెపి వాషింగ్ మెషిన్‌లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా? అని సిఎం రేవంత్ నిలదీశారు. కాంగ్రెస్‌కు ఆదానీ, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోడీని ఒక్కటే అడుగుతున్నానని, ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లలో సోదాలు నిర్వహించాలన్నారు. మోడీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఈడీ, సిబిఐ, ఎన్‌ఐఏలను అడ్డుగా పెట్టుకొని బిజెపి లబ్ధి పొందాలని చూస్తోందని, ఇప్పుడు ఢిల్లీ పోలీసుల ద్వారా భయపెట్టాలని చూస్తోందని సిఎం రేవంత్ ఆరోపించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com