13,972 ఎకరాల్లో నిర్మాణం కానున్న మరో సిటీ
ఇప్పుడు అందరి చూపు ముచ్చర్ల వైపు పడింది. సీఎం చేసిన ఒకే ఒక ప్రకటనతో.. భూముల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. రోజుకో ధర పలుకున్నది. గత బీఆర్ఎస్ హయాంలో కోకాపేట్వంటి ప్రాంతాలను హాట్ కేకుల్లా మారిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ముచ్చర్ల ప్రాంతాన్ని ఎంచుకున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు నగరాల మాదిరిగా.. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్, బేగరికంచె, ముచ్చర్ల ప్రాంతాల్లో నాలుగో మహా నగరాన్ని నిర్మించేందుకు సంకల్పించిన ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. 1
3,972 ఎకరాల్లో నిర్మాణం కానున్న ఈ మహా నగరంలో వివిధ విభాగాలు, ఉప కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భూములను కేటాయించింది. దీంతో రియల్టర్లు, బడా నాయకులు ఆ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. ఆ చుట్టు పక్కల భూముల వివరాలను ఆరా తీస్తున్నారు. అక్కడి రైతుల నుంచి ముందస్తుగా కొనుగోలు చేసి.. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కోకాపేట భూములకే రికార్డు ధరలు పలుకగా.. ఇప్పుడు ముచ్చర్ల భూములకు రేట్లు పెరగనున్నాయి.
నాలుగో సిటీ
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో హెల్త్, స్పోర్ట్స్ హబ్లు ఏర్పాటు కాబోతున్నాయి. అక్కడికి మెట్రోను అనుసంధానం చేయబోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తామని, స్టేడియం నిర్మాణంపై ఇప్పటికే బీసీసీఐతో మాట్లాడినట్లు చెప్పారు. బేగరి కంచ, మీర్ ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతున్నది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు.
వర్సిటీతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. నాలుగో సిటీ.. 13,972 ఎకరాల్లో నిర్మితమవుతుండగా.. దీనిలో ఏఐ సిటీ 297 ఎకరాలు, స్కిల్ వర్సిటీ 454 ఎకరాలు, ఇండస్ట్రీలు 4774 ఎకరాలు, ఎంటర్ టైన్ మెంట్ 470 ఎకరాలు, ఫర్చిచర్ పార్క్ 309 ఎకరాలు, హెల్త్ సిటీ 370 ఎకరాలతో రూపుదిద్దుకోనున్నాయి. దీంతో రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో రియల్ భూమ్ ఒక్కసారిగా పెరుగుతున్నది.
భూములు అమ్ముతారా..?
ప్రభుత్వం నిర్ణయంతో అధికార పార్టీ నాయకులతోపాటు, ప్రతిపక్ష నేతలు, పారిశ్రామిక వేత్తలు ముచ్చర్ల వైపు భూములపై గురి పెట్టారు. అక్కడ రైతులను, రియల్ ఎస్టేట్ ఎజెంట్ల నుంచి భూముల వివరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఇప్పటికే ధరలు రెండు, మూడింతలయ్యాయి. మీర్ఖాన్పేట్, బేగరికంచె, ముచ్చర్ల సమీపంలో భూములు కొనుగోలు చేసేందుకు తమ వర్గీయులు, బినామీలను రంగంలోకి దింపారు. పేరు పొందిన ఇన్ఫ్రా కంపెనీలు అక్కడ వెంచర్లు వేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వంలోని కొందరు నాయకులు అక్కడ వందల ఎకరాల మేర కొని పెట్టుకున్నారని, ఆ తర్వాతే అక్కడ సిటీ నిర్మాణం ప్రకటన జరిగిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.