Saturday, September 21, 2024

నాంపల్లిలో మల్టీలెవల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్ త్వరలో పూర్తి

  • నాంపల్లిలో మల్టీలెవల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్ త్వరలో పూర్తి
  • నిర్మాణ పనులను పరిశీలించిన మెట్రో రైల్ ఎండి
  • అర ఎకరం స్థలంలో 15 అంతస్తులుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణం
  • 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం,
  • ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు,
  • రెండు స్క్రీన్‌లతో కూడిన ఒక ఫిల్మ్ థియేటర్
  • త్వరలో పనులను పూర్తి
  • వచ్చే నెలలో ట్రయల్ రన్
  • మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి

కంప్యూటరైజ్డ్ మల్టీలెవల్ కారు పార్కింగ్ (ఎంఎల్‌పి) పనులు దాదాపుగా పూర్తయ్యాయని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నేడు (ఆదివారం) ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎండి, ఎంఎల్ పి పనులను పరిశీలించారు. పిపిపి విధానంలో ఈ ప్రాజెక్టును రూ. 80 కోట్ల పెట్టుబడితో నిర్మింపజేస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మన దేశంలో ప్రపథమంగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని ఎండి ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్‌కు సమీపంలో హెచ్‌ఎంఆర్‌కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్క్రీన్‌లతో కూడిన ఒక ఫిల్మ్ థియేటర్ ఉంటాయన్నారు.

లక్షా 400 వందల చదరపు అడుగుల్లో నిర్మాణం

మొత్తం లక్షా నలభై నాలుగు వందల చదరపు అడుగుల నిర్మిత ఏరియాలో 68 శాతం పార్కింగ్ కోసం, మిగిలిన 32 శాతం వాణిజ్య సదుపాయాలకు కేటాయిస్తున్నామన్నారు. పార్కింగ్ ప్రదేశంలో 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలను నిలిపే విధంగా అవకాశం ఉందన్నారు. పిపిపి విధానంలో మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ 50 సంవత్సరాల రాయితీ కాలంతో ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిందని ఆయన అన్నారు. కోవిడ్ తీవ్రత, డెట్ ఫైనాన్సింగ్ సమస్యలు, గ్లోబల్ సప్లయ్ చైన్ అంతరాయాలు తదితర కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమైందన్నారు. అయితే, నేడు ఈ సమస్యలను అధిగమించామని, అతి త్వరలో ఆధునిక పార్కింగ్ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రానుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. అత్యాధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ టెక్నాలజీ కాంప్లెక్స్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు ‘లోపలకు /బయటకు (ఇన్/ఔట్)‘ టెర్మినల్స్, వాహనాల నిలుపుదల కోసం టర్న్ టేబుల్స్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ టేబుల్ పై వాహనదారుడు తమ వాహనాన్ని వదిలి, తమ నిర్దేశిత పనులకు హాజరుకావచ్చన్నారు. ఎంఎల్ పి లోనికి వాహనం ప్రవేశించిన సమయంలో వాహనదారులకు స్మార్ట్ కార్డు జారీ అవుతుందని, తరుచూ ఎంఎల్ పిని వినియోగించే వారికి ‘ఆర్‌ఎఫ్‌ఐడి’ కార్డులు జారీ చేస్తామన్నారు.

వాహనం కొలతల ఆధారంగా పార్కింగ్ అలాట్

వాహనదారులకు ఏ టెర్మినల్‌కు కేటాయించారో ముందుగానే తెలియజేస్తారని ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వాహనం కొలతల ఆధారంగా కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా వాహనాల వర్గీకరణ జరుగుతుందన్నారు. ఎస్‌యూవి లేదా సెడాన్ వాహనానికి తగినట్లుగా పార్కింగ్ బేలు కేటాయించబడతాయన్నారు. ఆ తర్వాత ట్రాన్ పోర్ట్ షటిల్ ఆ వాహనాన్ని లిఫ్ట్ ద్వారా నిర్ణీత అంతస్తులో కేటాయించిన స్థలంలో పార్క్ చేస్తామన్నారు. ఈ మేరకు విశాలమైన, సౌకర్యవంతమైన టర్న్ టేబుల్స్‌ను ఏర్పాటు చేశామని ఎండి పేర్కొన్నారు. ముంబై, ఢిల్లీలో ఉన్న ఎంఎల్ పి పార్కింగ్ వ్యవస్థల్లో వాహనదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఆ పరిస్థితి ఇక్కడ ఉండదని ఆయన అన్నారు. పార్క్ చేసిన వాహనాన్ని తిరిగి పొందడానికి, డ్రైవర్ పార్కింగ్ రుసుము చెల్లించి, పార్కింగ్ టిక్కెట్‌ను కార్డ్ రీడర్ చూపగానే, ట్రాన్స్ పోర్టర్ -షటిల్ ఆటోమేటిక్‌గా కారును వాహనదారునికి అందజేస్తుందన్నారు. అదేవిధంగా, డ్రైవర్ కారును రివర్స్ తిప్పుకోవల్సిన అవసరం లేకుండా అందజేస్తామన్నారు. పార్కింగ్ కోసం కేవలం ఒక నిమిషం కంటే తక్కువ సమయం, తిరిగి పొందడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుందని ఎండి పేర్కొన్నారు. హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అధునిక పార్కింగ్ కాంప్లెక్స్ మన నగర కీర్తికిరీటంలో మరో కలికితురాయి అవుతుందన్నారు. త్వరలో పనులను పూర్తిచేసి వచ్చే నెలలోగా ట్రయల్ రన్ ప్రారంభించాలని ఎండి ఎన్వీఎస్ రెడ్డి కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular