ముంబయి విమానాశ్రయంలో ఐసిస్ స్లీపర్ సెల్ మెంబర్స్ అని భావిస్తున్న ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇండోనేసియా జకార్తా నుంచి మళ్లీ భారత్లోకి ప్రవేశిస్తున్న అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలా, తల్హాఖాన్లను రెండో నంబరు టెర్మినల్ వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం ఎన్ఐఏ వారిని అరెస్ట్ చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్, సిరియా- ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇద్దరు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
ఐసిస్ సానుభూతి పరులైన వీరు 2023లో ఉగ్రవాదుల కోసం పుణేలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్- IEDలు, ఇతర పేలుడు పదార్థాలు తయారు చేసినట్లు గుర్తించారు. అదే కేసులో 8 మంది ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేయగా- వీరిద్దరు మాత్రం ఎన్ఐఏ కళ్లుగప్పి ఇండోనేషియా పారిపోయారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐఈడీలు తయారుచేసిన ప్రదేశంలోనే బాంబు తయారీ వర్క్షాపులు కూడా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. వారిపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వారి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి మూడు లక్షలు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, హింస, ఉగ్రవాదం ద్వారా దేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలన్న ఐసిస్ ఎజెండా కోసం వీరు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. భారత్లో శాంతి, మత సామరస్యాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నారని వివరించారు
ఈ సమయంలోనే ముంబయి ఎందుకు వచ్చారు?
మరోవైపు, దాదాపు రెండేళ్లుగా పరారీలో ఉన్న వీరు భారత్-పాకిస్థాన్ మధ్య ఉత్రిక్తల సమయంలోనే ఎందుకు ముంబయి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో నిర్మూలించాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్య సాధన కోసం ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. కాగా, భారత్ ఐసిస్ కార్యకలాపాలను నిర్వీర్యం చేయడంలో ఈ అరెస్టులు కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పహల్గాం పాశవిక దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఎన్ఐఏ బృందాలు జమ్ముకశ్మీర్ అంతటా జల్లెడ పడుతున్నాయి. స్థానిక అధికారులతో కలిసి ఉత్తరకశ్మీర్లోని కుప్వారా, శ్రీనగర్, గడర్బాల్, బారాముల్లా వంటి 10 ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు.