Wednesday, April 2, 2025

Warangal Crime: ఒకవైపు దొంగతనాలు.. మరోవైపు హత్యలు, గంజాయి కేసులు

రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్​లో వరుసగా జరుగుతున్న హత్యలు, దొంగతనాలు, గంజాయి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గొలుసు దొంగలు చెలరేగిపోయి నగరంలో రెండుచోట్ల మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

కేవలం గంట వ్యవధిలో రెండు గొలుసు దొంగతనాలు నమోదయ్యాయి. దీంతో నగరంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి రెండుచోట్ల మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. గంట వ్యవధిలోనే మట్టెవాడ ఠాణా పరిధిలోని ఒకటి, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదరివాడలో మరో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.

మేదరివాడలో రాజలక్ష్మి అనే వృద్ధురాలు అయ్యప్ప చౌదాపుడి పూజ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి షాపు మూసివేస్తున్న సమయంలో బైక్​పై వచ్చిన ఇద్దరు దొంగలు పూజా సామగ్రి కావాలని అడగటంతో గుమాస్తా లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో దుకాణం కౌంటర్‌ వద్ద ఉన్న వృద్ధురాలి సమీపంలోకి వచ్చిన ఓ దొంగ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలు అరుస్తుండంగానే దుకాణం బయట వేచి ఉన్న మరో దొంగ వాహనం ఎక్కి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read Also:

ఎల్ఆర్‘ఎస్’ లే అవుట్ల క్రమబద్ధీకరణకు గ్రీన్​ సిగ్నల్​

వరంగల్​లో ఇటీవల వరుసగా హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. పాత కక్షలు, వివాహేతర సంబంధాలు, ఆర్థిక లావాదేవీల కారణంగా గత ఆరు నెలల్లో 24 హత్యలు, 57 వరకు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. 2023లో పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 44 హత్యలు జరిగాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్‌ వరకు నెలకు నాలుగు చొప్పున హత్యలు జరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పాత కక్షలు, ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం జరిగే హత్యలను అడ్డుకునే అవకాశం ఉన్నా.. నగర పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారని విమర్శలు తలెత్తుతున్నాయి.
రాజకీయ నాయకుల అండ ఉన్న రౌడీ షీటర్ల జోలికి వెళ్లేందుకు పోలీసులు భయపడుతున్నారు.

ఎవరి అండా లేనివారిని మాత్రమే పోలీస్ స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మరోవైపు కొందరు భూ వివాదాల్లో తలదూరుస్తూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఇదంతా పోలీసులకు తెలిసినా వారు వీటిని పట్టించుకోవడం లేదు. ఓ ఠాణాలో పనిచేస్తున్న పోలీస్‌ బాస్ పాత రౌడీషీటర్‌ చెప్పినట్లు చేస్తుండడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎవరిపై ఎప్పుడు, ఏ కేసు పెట్టాలో పాత రౌడీషీటర్లే మార్గనిర్దేశం చేస్తుండడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా పోలీసు పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు.

నగరంలో గంజాయి విక్రయాలు
నగరంలో గంజాయి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిలో ఎక్కువగా యువత ఉండటం తీవ్ర చర్యనీయాంశంగా మారింది. యువత విచ్చలవిడిగా గంజాయి తాగుతూ ఇతరులకు అమ్ముతున్నారు. ఒడిశా, అరకు, విశాఖపట్నం, తూర్పుగోదారి జిల్లా నుంచి యథేచ్ఛగా గంజాయి తీసుకొని వచ్చి విక్రయిస్తున్నారు. ఈ ఏడాదిలో 35 కేసులు నమోదు కాగా 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా గంజాయి ముఠా పోలీసుల కళ్లుగప్పి విక్రయిస్తున్నది ఇంతకు పదింతలు ఉంటుందని అంచనా. మరోవైపు నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డుపై యువకులు అర్ధరాత్రి బైకు రేసింగులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. పెద్ద శబ్దాలు వచ్చేలా సైలెన్సర్లు అమర్చి కాలనీల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. దీంతో వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.

అవినీతి ఆరోపణలు
వరంగల్ కమిషనరేట్‌ పరిధిలో కొందరు పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కొంత మంది పోలీసులను వీఆర్‌కు అటాచ్‌ చేశారు. తిరిగి రాజకీయ నాయకుల సిఫార్సులతో మరో ఠాణాలో పోస్టింగ్‌ ఇచ్చారు. రాజకీయనాయకుల జోక్యంతో పోలీసు ఉన్నతాధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

బందోబస్తులతో పోలీసులు బిజీ అట
బందోబస్తు, పని ఒత్తిడి, ఎన్నికల విధులు, బదిలీలు తదితర కారణాలతో నిఘా లోపం ఏర్పడిందని ఓ అధికారి పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన వారు పాత నేరస్థులపై నిఘా ఉంచడం, ఏయే ప్రాంతాల్లో అధికంగా నేరాలు జరుగుతున్నాయో గుర్తించలేకపోతున్నారు. ఎలాగూ బదిలీపై వెళ్తున్నామన్న ఉదేశంతో కొందరు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. అయితే, “నేరాల నియంత్రణకు చట్టం పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

గంజాయిని అరికట్టడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. అన్ని హత్య కేసుల్లో నిందితులను పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాం. ప్రస్తుతం నగరంలో నేరాలు అదుపులోనే ఉన్నాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నాం అని వరంగల్​సీపీ -అంబర్‌ కిషోర్‌ ఝా చెబుతున్నారు. నగరంలో జరిగిన రెండు గొలుసు దొంగతనాలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలు తనిఖీ చేస్తున్నామని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com