Tuesday, February 11, 2025

మూసీ సుందరీకరణతో పాటు మెట్రో రైలు

హైదరాబాద్ మహా నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరించాలని ఇప్పటికే నిర్ణయించిన రేవంత్ సర్కార్.. మూసీ పొడవునా మెట్రో రైల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. మూసీకి ఇరువైపులా రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లతో పాటు మెట్రో రైలు నిర్మిస్తే హైదరాబాద్ రూపరేఖలే మారిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతాలన్నీ అభివృద్ది చేయడం ద్వార గ్రేటర్ సిటీని మరో లెవల్ కు తీకుకెళ్లేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

హైదరాబాద్ మహా నగరంలో మూసీ అభివృద్దిపై ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే మూసీ రివర్ డెవలప్ మెంట్ కోసం డీపీఆర్ సిద్ధం చేసే పనిలోపడ్డ అధికారులు మూసీలో నిర్వాసితులను ఆదుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇచ్చిన అధికారులు, వారికి జీవనోపాధి దెబ్బతినకుండా ప్రతీ కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా నగరానికి కొత్త రూపు తీసుకురావడానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం. మురికి కూపంగా మారిన మూసీని థేమ్స్ నదిలా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసింది. గ్రేటర్ ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో పర్యటించి, అక్కడి నదీ పునరుజ్జీవానికి తీసుకున్న చర్యలపై అధ్యయనం చేశారు. అదే పద్ధతిలో మూసీనదిని సైతం తీర్చిదిద్దాలని భావిస్తోంది ప్రభుత్వం.

మూసీలో నార్సింగి నుంచి నాగోల్ వరకు ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు అధికారులు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలోకి వచ్చిన అక్రమ నిర్మాణాలను గుర్తించారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. అలాంటి ఇళ్లకు మార్కింగ్ ఇచ్చారు. తర్వాత వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయింపు చేశారు. దాంతో కొద్ది మంది డబుల్ బెడ్ రూం ఇళ్లకు కూడా షిఫ్ట్ అయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో తమ జీవనోపాధి దెబ్బతింటుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారందరినీ ఆదుకునేలా నిధులను కేటాయించింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సుమారు 15 వేల కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు. ప్రతీ కుటుంబానికి 25వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. 37 కోట్ల రూపాయలను మూడు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేయాలని డిసైడ్ చేశారు.

మూసీ నదిలో అభివృద్ధి పనులను మొదటి నుంచి చివర వరకు ఒకేసారి చేపట్టడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించిన అధికారులు, దశలవారీగా చేపట్టాలని ప్లాన్ చేశారు. నార్సింగి ప్రాంతంలోని లంగర్ హౌజ్ బాపూఘాట్ ప్రాంతాల్లో మొదటి దశలో అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో మూసీ పరిసరాలు ఖాళీగా ఉండటం, ఎక్కువ స్థలం అందుబాటులో ఉండటం బ్యూటీఫికేషన్ పనులు వేగంగా చేయొచ్చని, మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు గతంలో కేటాయించిన 15 వందల కోట్లు అందుబాటులో ఉండటంతో రైటాఫ్ వే అందుబాటులో ఉన్న ప్రతీ ప్రాంతంలో డెవలప్‌మెంట్ చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే మూసీ రివర్ డెవలప్ మెంట్ పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

సుమారు 25 వేల కోట్ల రూపాయలతో మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గోదావరి నదీ జలాలను తరలించి మూసీలో పారించాలని ప్రణాళికలు సిద్దం చేసింది. అంతే కాకుండా మూసీ నదీ కారిడార్‌ వెంట రోడ్‌ కమ్‌ మెట్రోరైలు మార్గం ఏర్పాటుచేయాలనేది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగా నది వెంట మెట్రోరైలు నిర్మాణానికి 9వేల కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా మెట్రో రైలు అధికారులు అంచనా వేశారు. 55 కిలో మీటర్ల దూరంలో 25 కిలోమీటర్ల వరకు భూ మార్గంగా వెళ్లేందుకు అవకాశముందని ప్రభుత్వానికి తెలిపారు. అధ్యయనం చేసిన తర్వాతే సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుందంటున్నారు. హైదరాబాద్‌లో నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌ నుంచి మొదలు బాపూఘాట్‌, హైకోర్టు, చాదర్‌ఘాట్‌, నాగోలు వైపు నుంచి తూర్పు హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌ వరకు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ను ప్రతిపాదిస్తున్నారు.

అవుటర్ రింగ్ రోడ్డు ఒకవైపు నుంచి రెండోవైపు రావాలంటే దాదాపు 80 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అదే పట్టణం లోపలి నుంచి రహదారి ఉంటే రాకపోకల దూరం తగ్గుతుందని కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. మూసీని సుందరీకరించడంతో పాటు రహదారి నిర్మాణం ఉంటుంది. ఈ మేరకు మెట్రో రైలు మార్గం నిర్మించాలనేది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఈ మార్గంలో, నాగోల్‌ తర్వాత కొంత దూరం భూమార్గం మీదుగా మెట్రో తీసుకెళ్లవచ్చు అనే ఆలోచనను హెచ్‌ఎంఆర్‌ ప్రభుత్వం ముందుంచింది. ఎత్తుగా ఉన్న చోట ఈ తరహాలో ఏర్పాటు చేయవచ్చు అనే సూచనలు చేసింది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అవకాశం ఉన్న మార్గాలను అధ్యయనం చేస్తోంది.

మూసీ వెంట రహదారి, మెట్రోతో పాటు నదీ గర్భంలో ఎల్లవేళలా నీరు ఉండేలా చేసి బోటు ప్రయాణం నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో కృష్ణా, గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించి అక్కడి నుంచి మూసీలోకి నీటిని వదిలి శుభ్రం చేస్తారు. అక్కడక్కడ ఎత్తుపల్లాలు పరిశీలించి అనువైన చోట ఐదు కిలోమీటర్లకు ఒక చెక్‌డ్యామ్‌ ఏర్పటుతో ఏడాదంతా నీరు ఉండేలా చూస్తారు. ఇందులో పర్యాటక బోటింగ్‌తో పాటు రవాణాను ప్రోత్సహిస్తారు. ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు బోటులో రాకపోకలు సాగించవచ్చు. ఇక మూసి పరిసరాల్లో పార్కులు, హోటల్స్, మల్టీ ప్లెక్సులు, షాపింగ్ మాల్స్ వంటివి ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com