వారిని శాలువాతో సత్కరించిన సిఎం
సిఎం రేవంత్ రెడ్డిని సీని సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణి, ప్రజాకవి అందెశ్రీలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం నివాసంలో ఆయనతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించారు. బుద్ధుడి విగ్రహాలను వారికి సిఎం బహుకరించారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటతో ఎంఎం కీరవాణి తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పగా, ఈ పాటకు ఆస్కార్ అవార్డు సైతం దక్కింది.
ఈ నేపథ్యంలోనే‘జయజయహే తెలంగాణ’ పాటను కీరవాణితో పాడించే అంశంపై వారు చర్చించినట్టుగా తెలిసింది. ఈ భేటీలో రచయిత అందెశ్రీ సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, సిఎం సిపిఆర్ఓ ఆయోధ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.