మా నాన్నకు తాను లేఖ రాస్తే తప్పేంటి? అయినా నీకు నొప్పి ఏంటిరా బయ్? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సోదరుడు కేటీఆర్ను ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడితే సరి కాదని కేటీఆర్కు ఆమె హితవు పలికారు. గురువారం కవిత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనకు నీతులు చెబుతోన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు.. తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలంటూ సూచించారు. కేసీఆర్ నీడలో పని చేస్తోన్న వారు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా కవిత సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగిందంటూ ఆరోపించారు. తనపై ఢిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు జరిగాయని తెలిపారు.
పదేపదే తన మీద పడి ఏడిస్తే మీకు ఏం వస్తుందని, ఆడబిడ్డ మీద ఏంటీ మీ ప్రతాపమూ అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లినప్పుడే తాను పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని, కానీ కేసీఆర్ ను ఏం చేయలేక నీ మీద కేసులు పెడుతున్నారని చెప్పారని కవిత అన్నారు. లీకు వీరులను పట్టుకోండి అంటే గ్రీకు వీరులు తనపై దాడి చేస్తున్నారని కవిత వాపోయారు. మీ తెలివి ప్రతిపక్ష నేతలపై చూపించండి.. తన జోలికి వస్తే బాగుండదు.. తాను అసలే మంచిదాన్ని కాదన్నారు.
తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలకు పార్టీ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. తన లేఖను లీక్ చేసిందో ఎవరో చెప్పాలన్నారు కవిత. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవని ప్రశ్నించారు. తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని ఆమె నిలదీశారు. పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరఫున తాను చేస్తున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ తో రాయాబారాలు చేసే అవసరం తనకు లేదన్న కవిత.. తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో నన్ను కావాలనే ఓడించారని కవిత ఆరోపించారు. నన్ను పార్టీకి దూరం చేస్తే ఎవరికి మంచిదో అందరికీ తెలిసిందేనని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏమి చేసినా.. కేంద్రం అడ్డుకోవటం లేదని ఒకింత అసహనాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికీ గోదావరి నదీ జలాలు పంపకం సరిగా జరగలేదన్నారు.
దమ్ముంటే కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు. తాను అసలే మంచి దాన్ని కాదని.. తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేయకుండా.. ట్వీట్టర్లో మెసేజ్లు పెడితే సరిపోతాయా? అంటూ సోదరుడు కేటీఆర్ను ఆమె సూటిగా ప్రశ్నించారు. తనను రేవంత్ రెడ్డి కోవర్ట్ అనటం కరెక్టేనా? అని ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్ట్లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకి బీఆర్ఎస్ను అప్పగించే ప్రయత్నం జరుగుతుందని ఆమె అభిప్రాయమన్నారు. తనను కాంగ్రెస్ కోవర్ట్ అన్నారు. మరి బీఆర్ఎస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారనుకోవాలా? అని సందేహం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్నప్పుడే.. బీజేపీలో బీఆర్ఎస్ను కలపొద్దని కేసీఆర్ను కోరానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తొందరపాటు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్కు సూచించానన్నారు. ఆరు నెలలు కాదు.. సంవత్సరాలు అయినా జైల్లో ఉంటానని కేసీఆర్కు తాను స్పష్టం చేశానని కవిత ఈ సందర్భంగా వివరించారు.
బీజేపీ నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరకీ తెలుసునంటూ పార్టీలోని అగ్రనేతలను ఆమె పరోక్షంగా విమర్శించారు. తన లేఖ లీక్ చేసిందెవరు తేల్చంటే.. తనపై పడి ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారన్నారు. కేసీఆర్ లెక్క.. తాను చాలా తిక్కదానినని ఆమె పునరుద్ఘాటించారు. వెన్నుపోటు రాజకీయాలు తను రావని.. సూటిగా మాట్లాడుతానని కుండ బద్దలు కొట్టారు. సామజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాడుతానన్నారు. మా వాళ్ళు కొందరు.. సోషల్ మీడియాలో మహాభారతం క్యారెక్టర్లు వేస్తున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు. వారు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ సభ తమ వలనే సక్సెస్ అయిందని కొందరు ఊహించుకుంటున్నారన్నారు. కేసీఆర్ను మోసేంత పెద్ద వాళ్ళు అయిపోయామని వారంతా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.