మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా తెలుస్తున్నది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్లో హతమైనట్లు అనుమానిస్తున్నారు. బుధవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోలు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు భారీగా పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచీ భద్రతా బలగాలు, నక్సల్స్కి మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కేశవరావు ఉన్నారు. కాగా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉంది. ఈ ఎదురుకాల్పుల్లో కేశవరావుతోపాటు మరికొందరు కీలక నేతలు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో బాంబుదాడి ప్రధాన సూత్రధారి అయిన నంబాల కేశవరావు ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. 2010లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిలోనూ ఇతనిదే కీలకపాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 నుంచి పార్టీకి సుప్రీం కమాండర్గా కేవశవరావు బాధ్యతలు వహిస్తున్నారు. ఇతను గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో దిట్ట. ఎంటెక్ చేస్తున్న సమయంలో నక్సలిజానికి ఆకర్షితుడైనట్లు తెలుస్తోంది. కాగా, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.