రోశయ్య దవాఖానా.. శ్రీరాములు రైల్వే స్టేషన్
తెలంగాణ కోసం కృషి చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటికీ సురవరం ప్రతాప రెడ్డి వర్సిటీగా పేరు మార్చుతున్నట్లు అసెంబ్లీలో సీఎం తెలిపారు. అదే సమయంలో రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ సీఎం, దివంగత రోశయ్య పేరును హైదరాబాద్ బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా చర్లపల్లి టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరారు. ఇక, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య సేవల్ని అందరూ గుర్తుంచుకోవవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన్ను స్మరించుకునేందుకు గాను హైదరాబాద్ బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెట్టనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. రోశయ్య ఇంటికి దగ్గర్లోనే నేచర్ క్యూర్ ఆసుపత్రి ఉంటుందని.. అక్కడ ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రోశయ్య వర్ధంతి, జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
దివంగత రోశయ్య ఉమ్మడి ఏపీలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘ అనుభవం ఉందని అన్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ప్రజలకు ఎనలేని సేవలు అందించినట్లు చెప్పారు. తాను ఏపీ చీరాలలో జన్మించినా.. ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగరంలో సెటిల్ అయినట్లు గతంలో రోషయ్య చెప్పారని గుర్తు చేసుకున్నారు. వారి పట్ల ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవని.. ఆయన చేసిన సేవలకు గుర్తుగా నేచర్ క్యూర్ ఆసుపత్రికి పేరు పెట్టడమే కాకుండా.. విగ్రహం పెట్టి మంచి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఆయన సేవల్ని మరిచిపోకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును సైతం సభలో ప్రవేశపెట్టారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని.. అదే సమయంలో పొట్టి శ్రీరాములు పేరుతో ఏపీలోనూ వర్సిటీలు ఉన్నాయన్నారు. ఇలా రెండు, మూడు వర్సటీలకు ఒకే పేరు ఉండటం వల్ల పాలనా పరమైన ఇబ్బందులు వస్తున్నాయని.. అందులో భాగంగానే పేరు మార్చుతున్నట్లు చెప్పారు. అంతే తప్ప పొట్టి శ్రీరాములపై ఎలాంటి చిన్న చూపు లేదని చెప్పారు. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టేలా కేంద్రాన్ని కోరతాన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు లేఖలు రాయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో వెల్లడించారు.