– అమ్మను చంపింది నాన్నే
– నాలుగేళ్ళ పిల్ల డ్రాయింగ్ వేసి మరి చెప్పింది
– పాప వాగ్మూలంతో నిందితుడు అరెస్ట్
నాలుగేళ్ల చిన్నారి డ్రాయింగ్ వేసి మరీ తన తల్లిని చంపిన హంతకుడిని పట్టించింది. ఈ ఘాతకానికి పాల్పడింది మరెవరో కాదు స్వయాన తన తండ్రే. ఉత్తరప్రదేశ్లోని ఝన్సీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఝాన్సీ కొత్వాలి ప్రాంతంలోని శివ్ పరివార్ కాలనీ ప్రాంతంలో 27 ఏళ్ల వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బాధిత మహిళ నాలుగేళ్ల కుమార్తెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఝాన్సీకి చెందిన సందీప్ బుధోలియాతో 2019లో సదరు మహిళకు వివాహమైంది. రూ. 20 లక్షల నగదు, ఇతర లాంఛనాలను కట్నంగా ఇచ్చినట్టు ఆమె తండ్రి సంజీవ్ త్రిపాఠి తెలిపారు. అయితే, పెళ్లయిన కొన్ని నెలల నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించేవారని ఆరోపించారు. ఇంటి నుంచి డబ్బులు తీసుకురాకపోవడంతో ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీస్ స్టేషన్కు చేరడంతో ఇరు కుటుంబాలు రాజీపడ్డాయి.
ఆ తర్వాత వారికి ఓ పాప కూడా పుట్టింది. అయినా గొడవలు మాత్రం ఎక్కడా ఆగలేదు. అబ్బాయి పుట్టలేదంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తాజాగా, ఆమె అత్తగారింట్లో ఉరికి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని విచారించారు. ఈ క్రమంలో బాధితురాలి నాలుగేళ్ల కుమార్తెను కూడా విచారించారు. ఆ చిన్నారి వాంగ్మూలం ఇవ్వడంతోపాటు తల్లిని తన తండ్రి ఎలా చంపిందీ డ్రాయింగ్ వేసి చూపించింది.
‘‘పాపా (నాన్న) అమ్మను కొట్టి ఉరివేశాడు. రాయితో తలపై కొట్టాడు. ఆపై గోనె సంచిలో వేసి దూరంగా విసిరేశాడు. ముందు రోజు కూడా అమ్మను భయపెట్టడానికి నాన్న ప్రయత్నించాడు. అప్పుడు నేను ‘‘నువ్వు అమ్మను కొడితే నీ చేతులు విరిచేస్తాను’’ అని చెప్పాను. నాన్న ఎప్పుడూ అమ్మను కొడుతుండేవాడు. అందుకే చచ్చిపోయింది. నన్ను కూడా కొట్టేవాడు’’ అని చిన్నారి వివరించింది. అంతేకాదు, డ్రాయింగ్ వేసి మరీ చూపించింది. చిన్నారి వాంగ్మూలంతో రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.