ప్రతి రోజూ 5 లక్షల మంది రాకపోకలు.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే టికెట్ ధరలు కూడా కొంత ఎక్కవే. అయినా నష్టాల్లోనే హైదరాబాద్ మెట్రో సాగుతూనే ఉంది. హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకు రూ.కోటిన్నర నష్టం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో టికెట్ ధరలు పెంచాలని మెట్రో రైలు సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ప్రయాణికులపై భారం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేమంటూ ప్రభుత్వం నుంచి రిప్లై ఇచ్చారు. నష్టాలు వస్తున్నా, ధరలు పెంచే ఆలోచన లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. కానీ, ఈ నష్టాలతో నడుపలేమంటూ ఎల్ అండ్ టీ వాదన. దీంతో ప్రత్యామ్నాయ లాభాల గురించి అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది.
హైదరాబాద్ ప్రజా రవాణాలో మెట్రోది కీలక పాత్ర. ప్రతినిత్యం లక్షల సంఖ్యలో మెట్రోల్లో ప్రయాణాలు సాగిస్తుంటారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు తక్కువ సమయంలో సుఖవంతంగా చేరుకునేందుకు చాలా మంది మెట్రోలను ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో మెట్రో ట్రైన్లు పరుగులు పెడుతుండగా.. దాదాపు అన్ని రూట్లలోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే మెట్రోకు ఆదరణ ఉన్నా.. నిర్వహణ సంస్థకు మాత్రం నష్టాలు తప్పటం లేదట. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. ప్రతి రోజు మెట్రోకు కోటిన్నర రూపాయల నష్టం వస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అప్పు తీసుకోగా.. ఆ అప్పులకు వడ్డీ కూడా కట్టలేకపోతున్నామని మెట్రో అధికారులు అంటున్నారు.
మెట్రో వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోజుకు 5.10 లక్షల మంది ప్రయాణికులు మెట్రో ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. కరోనా ముందు రోజుకు రూ. 80 లక్షలకు పైగా ఆదాయం వచ్చేది. కానీ, లాక్డౌన్ వల్ల మెట్రోకు భారీ నష్టం వాటిల్లింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కాస్త మెరుగుపడినా.. నష్టాలు మాత్రం తగ్గడం లేదు. అనుకున్నంత మంది ప్రయాణికులు రాకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గిపోయిందని అంటున్నారు. ఈ కారణంతోనూ మెట్రో నష్టాల్లోకి వెళుతోందని చెబుతన్నారు.
టికెట్ ధరలు పెంచితే కొంత నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చునని మెట్రో అధికారులు భావిస్తున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలపై ఎక్కువ భారం వేయడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మెట్రో రెండో దశ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇప్పుడు టికెట్ ధరల పెంపు గురించి కేంద్రంతో మాట్లాడితే.. అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది. ప్రస్తుతం మెట్రో కనీస టికెట్ ధర రూ. 10 నుంచి గరిష్ఠ టికెట్ ధర రూ. 60 వరకు ఉన్నాయి. ఒకవేళ ధరలు పెంచితే కనీస టికెట్ ధర రూ. 20.. గరిష్ఠ ధర రూ. 80 అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రతిపాదన గత రెండేళ్లుగా ఉన్నా ధరలు మాత్రం పెరగలేదు. ఒకవేళ టికెట్ ధరలు పెరిగితే సామాన్యులకు అదనపు భారమే అవుతుంది.