ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ మహిళా నేత శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. యాంకర్ శ్యామల ‘ఆంధ్ర 365’ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు ప్రచారం చేసినందుకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో తాను నిర్దోషినని, తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆమె కోర్టును కోరారు.
బెట్టింగ్ యాప్స్ పెరిగిన నేపథ్యంలో చర్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభం కావడంతో, ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ ఈ యాప్స్ విస్తరిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో బెట్టింగ్ యాప్ల ప్రభావంతో కొందరు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘హ్యాష్ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెలబ్రిటీల ద్వారా యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల యువత ఎక్కువగా ప్రేరేపించబడుతున్నారని భావిస్తూ, యాంకర్లు, నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారి జాబితాలో ప్రముఖులు
సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో స్టార్స్ దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అలాగే అనన్య నాగళ్ల, శ్రీముఖి, సిరి హనుమంతు, వర్షిణి, సౌందర్రాజన్, విష్ణుప్రియ, శోభా శెట్టి, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజలు ఉన్నారు.