నేరాల విధానం చాలా వేగంగా మారుతుందని, ఒకప్పుడు దేశంలో హత్యలు, దోపిడీలు తీవ్ర నేరాలుగా పరిగణించేవారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అత్యంత నేరం సైబర్ క్రైమ్ అని, పోలీస్ అధికారులు నిరంతర కృషితో తెలంగాణలో సైబర్ నేరాలు కట్టడి చేస్తున్నామన్నారు. సైబర్ క్రైమ్ను నియంత్రించడంలో దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని, ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం కన్నా, నేరం జరగకుండా నిరోధించేలా అడుగులు వేయాలన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ – 2025 (షీల్డ్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణను సైబర్ సేఫ్టీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశం మొత్తం ఒక తాటిపైకి వచ్చి సైబర్ క్రైమ్పై పోరాటం చేయాల్సి అవసరాన్ని నొక్కి వక్కానించారు.
డీప్ ఫేక్ న్యూస్తో ప్రమాదం పొంచి ఉందని, తప్పుడు వార్తల విషయంలో సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని, అలాంటి సమాచారం సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. అలాగే ఆర్థిక నేరాలను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దుదామన్నారు.
సమాజంలో వస్తున్న మార్పులు, సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచన చేశారు సీఎం. సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. సైబర్ క్రైం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో 14 రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాల నిరోధానికి దేశం మొత్తం యూనిట్గా పనిచేయాలపి సీఎం రేవంత్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.