మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. బస్సుల్లో రద్దీ పెరిగడంతో గ్రేటర్ పరిధిలో చాలా దూరం వరకు నిల్చొనే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్లో కొత్త బస్సులు నడుపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్లో కొత్త బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ ఎసీ ఎలక్ట్రిక్ బస్సులు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు జులై చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి.
ఇక ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందు కోసం ప్రత్యేకంగా 125 డీలక్స్ బస్సులను నడపాలని డిసైడ్ అయింది. ఈ బస్సులు కూడా జులైలోనే ప్రయాణికులకు అందుబాటులో రానున్నాయి. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన రూట్లలో ఈ డీలక్స్ బస్సులు నడపనున్నారు. ప్రస్తుతం సిటీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్త డీలక్స్ బస్సుల్లో మహాలక్ష్మీ పథకం వర్తించదని, ప్రయాణించే వారందరూ టిక్కెట్ తీసుకోవాల్సిందేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.